
వైద్య విద్య అడ్మిషన్లలో జీఓ 33 అమలు చేయాలి
ఎంజీఎం : రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2024, జూలై 19న జారీ చేసిన జీఓ 33ను ఈ విద్యా సంవత్సరం –2025–26లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో అమలు చేయాలని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీఓ 33 అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ సోమవారం కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థుల స్థానిక స్థితిని కాపాడడం, కాంపిటెంట్ అథారిటీ కోటా (రాష్ట్ర కోటా) కింద రాష్ట్రంలో విద్యను పూర్తి చేసిన వారికి సరిగా సీట్ల కేటాయించేందుకు ప్రభుత్వం ఈ జీఓ తీసుకొచ్చిందన్నారు. ఈ జీఓ అమలు ద్వారా రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లలో జీఓ 33 అమలు చేయాలని కోరారు.