
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కో రినట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 అధ్యక్షుడు జి.సంజీవ రెడ్డి, సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భట్టి విక్రమార్కను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలు చెప్పిన వెంటనే ట్రాన్స్ కో సీఎండీకి ఫోన్ చేసి త్వరలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ మార్పు చేయడంతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, 01.02.1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్ అందించాలని, విద్యుత్ సంస్థలో మిగిలివున్న 6,500 అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. ఖాళీలను భర్తి చేయాలని, ట్రాన్స్కో సీబీడీ గ్యాంగ్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు విద్యార్హతతో పనిలేకుండా గ్రేడ్–1 జీతం ఇవ్వాలని కోరామన్నారు. కారుణ్య నియామకాల వయస్సును 46 సంవత్సరాలకు పెంచాలని కోరినట్లు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.