
33 కేవీ విద్యుత్ లైన్లో డిస్క్ల సమస్య
హన్మకొండ: 33 కేవీ విద్యుత్ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతుండడంతో సమస్య గుర్తించేందుకు విద్యుత్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి ఆరెపల్లి 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి వరంగల్ ఉర్సు, హనుమకొండలోని న్యూ శాయంపేట వరకు మూడు సంవత్సరాల క్రితం 33 కేవీ లైన్ వేశారు. ఈ విద్యుత్ లైన్ ఏర్పాటైనప్పటి నుంచి తమకు అవస్థలు తప్పడం లేదని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు. నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లు వాడడంతో అవి తరచూ పగిలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను గుర్తించడానికి పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. పగిలిన డిస్క్, ఇన్సులేటర్ గుర్తించడానికి ప్రతీ స్తంభాన్ని ఎక్కి దిగాల్సి వస్తోందని వాపోయారు. స్తంభం ఎక్కితేనే పగిలింది కనిపిస్తుందని, కింది నుంచి చూస్తే ఫాల్ట్ దొరకడం లేదని తెలిపారు. విద్యుత్ లైన్ వేసిన క్రమంలో నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ఈ విద్యుత్ లైన్లో తరచూ సరఫరాలో అంతరాయం కలుగడం, డిస్క్లు, ఇన్సులేటర్లు ఫెయిల్ కావడంపై టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్లో జరిగిన సమీక్షలో విద్యుత్ లైన్ వేసిన కాంట్రాక్టర్ ద్వారా డిస్క్లు, ఇన్సులేటర్లన్ని మార్పించాలని సంబంధిత అధికారిని ఆదేశించారని సమాచారం. కానీ, వాటిని మార్చకపోవడంతో సమస్య పునరావృతమవుతూనే ఉంది. వారానికి ఒకసారి డిస్క్, ఇన్సులేటర్ ఫెయిల్, షాట్ సర్క్యూట్తో బ్రేక్ డౌన్ అవుతూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రెండేళ్లలో 18 డిస్క్లు మార్చినట్లు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు బిగించకపోతే విద్యుత్ అంతరాయాలు తప్పవని, ఫాల్ట్ కనుక్కోవడానికి ప్రతీ స్తంభం ఎక్కి దిగాల్సిందేనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికై నా టీజీ ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీఎండీ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు ఏర్పాటు చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
టైర్ పగిలి డీసీఎం బోల్తా..
● యువకుడి మృతి.. ముగ్గురికి గాయాలు
● మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘటన
మడికొండ: టైర్ పగిలి డీసీఎం బోల్తాపడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మడికొండ ఔటర్ రింగ్ రో డ్డుపై జరిగింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. డీసీఎంలో ఎస్బీఐ బ్యాంకు లాకర్లను తీసుకుని హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి నలుగురు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మడికొండ శివారు టెక్స్టైల్ పార్కు సమీపంలో డీసీఎం వెనుక టైర్ పగిలింది. దీంతో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో లాకర్ మీదపడి హైదరాబాద్కు చెందిన ఎండీ జావీద్ఖాన్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ క్యాబిన్లో ఉన్న ముగ్గురు ఎండి. హబీబ్ఖాన్, ఎండి. మోయిజ్ఖాన్, ఎండి. సలీమ్ఖాన్కు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించి, మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఇదే ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతుడి బంధువు మోయిన్ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లతో అవస్థలు
మార్పించాలని సీఎండీ ఆదేశం
రెండున్నర నెలలు గడుస్తున్నా మార్చని అధికారులు
విద్యుత్ సరఫరాకు అంతరాయం