
భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ..
హన్మకొండ కల్చరల్ : నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, రుత్విగ్వరణ, వాస్తుయాగం, గణపతిహోమం, సుదర్శనహోమం, శ్రీభద్రకాళీ పరివస్యా, చండీహోమం, నీరాజన మంత్రపుష్పం జరిపారు. అనంతరం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం అంకురార్పణ పూజలు నిర్వహించి సర్వతోభద్ర, నవగ్రహ, వాస్తు, యోగినీ, క్షేత్రపాలమండల లేఖనం, ధ్వజాధివాసం చేశారు. ఉదయం శ్రీగణపతి సేవ , సాయంత్రం శ్రీసుబ్రహ్మణ్యసేవ నిర్వహించారు. అంకురార్పణ పూజలకు ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు గైనేని రాజన్, బాధ్యులు కటకం పెంటయ్య, ఈవీ శ్రీనివాస్, తోట వెంకన్న, కనుకుంట్ల రవికుమార్, బక్కి రాజ్కుమార్, సుజన్కాంత్, పాటి శ్రీనివాస్, శ్రీధర్, రాము, సత్యనారాయణ, వరుణ్, చందు, సతీష్, కుమారస్వామి, ప్రకాష్, రాములు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.
వైభవంగా అంకురార్పణ పూజలు

భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ..