సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 12వ స్వర్ణ వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీ కోటగిరి లక్ష్మీప్రసన్న (34) బుధవారం మృతి చెందింది. పట్టణంలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మీప్రసన్నకు పిల్లలు లేకపోవడంతో రొటీన్ చెకప్లో భాగంగా గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలను మంగళవారం వెళ్లింది. ఈ క్రమంలో ఆమె గర్భసంచిలో తిత్తులు తొలగించేందుకు సర్జరీ చేయాలని వైద్యులు నిర్ధారించారు. బుధవారం ఆమెకు వైద్యశాలలో వైద్యులు మత్తు ఇవ్వగా, డోస్ అధికం కావడంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భర్త బెల్లంకొండ భార్గవ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ వ్యవహారాలు చూస్తుంటారు. గురువారం లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ బి. మధుసూదనరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ విజయసారథి, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను రవాణా కేసులో నిందితుడైన వెంకట రామాంజనేయులును కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ జె.మురళీకృష్ణ తెలిపారు.
భవనాలు కూల్చేవే..
అలుగు లక్ష్మీనారాయణ పాత భవనాలు కూల్చడం, స్లాబులు పగలగొట్టడం, పునాదులు తీయడం వంటి పనులు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని తమ్ముడు సాయి, మేనల్లుడు గుంజా వెంకట రామాంజనేయులు అతని వద్దే పనిచేస్తుంటారు. రామాంజనేయులు వడ్డేశ్వరంలో ఉంటుండగా, సాయి పెనమలూరు మండలం కానూరులోని మురళీనగర్లో ఉంటున్నాడు. భవనాల తొలగింపు పనుల్లో అవసరమైనప్పుడు జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వాడుతుంటారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని లక్ష్మీనారాయణ, రామాంజనేయులు స్వగ్రామానికి వెళ్లారు. కుంట గ్రామంలో లక్ష్మీనారాయణ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేశాడు. వాటిని బ్యాగ్లో పెట్టి సాయికి ఇవ్వాలని వీరాంజనేయులుకు ఇచ్చి వేరే పని మీద వెళ్లిపోయాడు. ఈ నెల 14వ తేదీన అతను శ్రీశైలం నుంచి విజయవాడ బస్సు ఎక్కాడు. అదేరోజు రాత్రి 10గంటల సమయంలో వారధి వద్ద దిగే తొందరలో మరో బ్యాగ్ తీసుకుని బస్సు దిగాడు. అంతటా అతను మురళీనగర్లో ఉంటున్న సాయి వద్దకు చేరుకుని బ్యాగ్ తెరిచి చూడగా దుస్తులు ఉన్నాయి. బ్యాగ్ మారిపోయిందని నిర్ధారించుకుని వడ్డేశ్వరంలోని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు ఉన్న ఒక్క బ్యాగ్ లభించిందని కలకలం రేగింది. పోలీసులు బస్సులో పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయం తెలుసుకున్న రామాంజనేయులు బుధవారం స్టేషన్లో లొంగిపోయాడు.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
గురువారం రామాంజనేయులును అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు లక్ష్మీనారాయణ, సాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.


