● అప్పటికీ పరిష్కరించకపోతే సమ్మె చేయటానికి సిద్ధం ● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందకి సాహెబ్
మంగళగిరి రూరల్: వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి సాముహిక రాయబార కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నుట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బందకి సాహెబ్ తెలిపారు. మండల పరిధి చినకాకాని గ్రామం నేతన్న సర్కిల్ వద్ద గురువారం వీఆర్ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. బందకి సాహెబ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. నెలకు రూ.11 వేల నుంచి రూ.11,500 మాత్రమే వేతనం అందుతోందని చెప్పారు. తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో మదనపల్లిలో రెవెన్యూ ఆఫీస్లో ఫైల్స్ తగలబడితే అప్పటి నుంచి మమల్ని నిబంధనలకు విరుద్ధంగా రాత్రి విధులు నిర్వహింపజేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు టీఏ, డీఏ, రక్షణ సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15–16 ఏళ్లుగా ప్రమోషన్లు లేక వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారని, అర్హులందరికీ వన్న్టైమ్ సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీసీఎల్ఏ అధికారితో సామూహికంగా రాయబారం నిర్వహించి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.


