పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. గుంటూరు జిల్లా కేంద్రంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి నిత్యం 150 నుంచి 200 మంది వరకు లైసెన్స్ కోసం వస్తున్నారు. గుంటూరులో పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంతో సెన్సార్ కెమెరాల ద్వారా ట్రయల్ రన్ జరుగుతోంది. పూర్తిస్థాయిలో లైసెన్స్లు అడ్డగోలుగా జారీ చేసే పరిస్థితి ఉండటం లేదు. ఇందులో కూడా కొంత మంది ఫోర్వీలర్ కోసం దరఖాస్తు చేసుకుని చలానా కట్టిన తరువాత డ్రైవింగ్ స్కూల్ కార్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించి లైసెన్స్లు జారీ చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) కోసం రూ.450 చెల్లించి చలానా తీయాల్సి ఉంటుంది. కంప్యూటర్ పరీక్షల అనంతరం నెల రోజుల వ్యవధిలో తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కు హాజరు కావాలి. అయితే ఈ క్రమంలో అక్కడి అధికారులు, సిబ్బంది కొత్త డ్రామాకు తెరతీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరిలో ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా, గుంటూరులో నలుగురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, తెనాలిలో ఇద్దరు, మంగళగిరిలో ఇద్దరు ఉన్నారు. ఎల్ఎల్ఆర్ పరీక్ష పూర్తయిన తరువాత నెల రోజుల వ్యవధిలో లైసెన్స్ వస్తుంది. ఎల్ఎల్ఆర్ వచ్చిన తరువాత ఆర్టీఏ కార్యాలయం వద్ద ఏజెంట్లు అక్కడకు వచ్చిన దరఖాస్తుదారులతో మాట్లాడతారు. కంప్యూటర్ పరీక్ష నుంచి లైసెన్స్ ఇప్పించే వరకు బాధ్యత తమదేనని చెబుతారు. లైసెన్స్ చలానా కేవలం రూ.1,650 మాత్రమే కాగా, రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు బేరం కుదుర్చుకుంటారు. ఈ క్రమంలో కార్యాలయంలోని సిబ్బందితో మాట్లాడి కంప్యూటర్ రూములో పరీక్షను వారే పక్కన ఉండి రాయించేస్తారు. అనంతరం అధికారులకు ఏజెంట్ ద్వారా వచ్చిన విషయాన్ని తెలియజేసి మంగళగిరి, తెనాలి ప్రాంతాల్లో నెల రోజుల వ్యవధిలో స్లాట్ బుక్ చేయిస్తారు. వారి ద్వారా జీరో బ్యాలెన్స్ అకౌంట్, గ్యాస్ బిల్లు వంటి నకిలీ పత్రాలు సృష్టించి తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో సిటిజన్ సైట్లో అడ్రస్ మార్చుకుని లైసెన్స్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం
లైసెన్స్లు జారీ విషయంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. అడ్రస్ ప్రూఫ్లు మార్చుకుని లైసెన్స్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాం. అధికారులు కూడా పూర్తిస్థాయిలో అన్ని పరిశీలించి లైసెన్స్లు జారీ చేయాలి. సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు. – శ్రీహరి, ఆర్టీఓ
కనీస టెస్ట్లు లేకుండానే...
తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో సెన్సార్ సిస్టమ్ లేకపోవడం, అక్కడ మాన్యువల్ పద్ధతుల్లో లైసెన్స్లు ఇచ్చే క్రమంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది నుంచి అప్పటికే ఫైల్కు సంబంధించిన సమాచారం అందుతుంది. కనీస టెస్ట్లు కూడా లేకుండానే ద్విచక్ర వాహనం, ఫోర్వీలర్కు నేరుగా లైసెన్స్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెంట్ వ్యవస్థను కొంత మంది జిల్లా స్థాయి అధికారులు, ఆర్టీవోలు, ఎంవీఐలు పెంచిపోషిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ఇక్కడే పలు హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం ఒక ప్రధాన పోస్టులో ఉన్న అధికారి వీటన్నింటికీ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. లైసెన్స్ల ప్రక్రియలో భాగంగా డేటా కోసం అధికారులను సంప్రదించగా స్పందించడం మానేశారు. ఎన్నిసార్లు అడిగినా మిన్నకుండిపోతున్నారు. దీనిపై జోనల్, జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని లైసెన్స్దారులు కోరుతున్నారు.
కొత్త డ్రామాకు తెరతీసిన అధికారులు..
ప్రైవేట్ ఏజెంట్లతో ఆర్టీఏ అధికారులు,
సిబ్బంది కుమ్మక్కు
గుంటూరులో స్లాట్ బుకింగ్..
తెనాలి, మంగళగిరిలో పరీక్ష
డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే
అడ్డగోలుగా ఫోర్వీలర్ లైసెన్స్లు
అవినీతికి మారుపేరైన రెవెన్యూ శాఖతో సమానంగా పోటీ పడుతున్నారు ఆర్టీఏ అధికారులు. లైసెన్స్ కోసం వెళ్లామంటే చాలు, లంచం ఇవ్వందే పని చేయడం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితో మధ్యవర్తులతో కుమ్మకై ్క జేబులు నింపుకొంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.