మహిళల భద్రతలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
ఎస్టీయూ నాయకులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఉద్యోగ నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉగ్గం మహంకాళిరావు, జె.శంకర వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల వారీగా చేపడుతున్న ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా రూపొందిస్తున్న జిల్లా సీనియారిటీ జాబితాల్లో ఉపాధ్యాయులందరికీ పూర్తి న్యాయం జరగాలని, వారి అసలు నియామక తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని కల్పించాలన్నారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో ఉంటూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా సీనియారిటీ జాబితాల రూపకల్పన ఉండకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా కింది వర్గాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ప్రక్రియ అని, దీని ప్రభావంతో దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగినా ఎస్టీయూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యాశాఖ, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉపాధ్యాయుల అసలు నియామక తేదీ ప్రకారమే తుది సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఉపాధ్యాయ లోకానికి నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు కొరివి విజయబాబు, తదితరులు పాల్గొన్నారు.


