కష్టార్జితం ఖాళీ జిల్లాలో పెరిగిన సైబర్ మోసాలు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గతంలో కత్తులతో బెదిరించి దోపిడీలు, ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, నగలు ఎత్తుకెళ్లడం వంటి నేరాలకు పాల్పడిన దొంగలు ఉండేవారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ను ఆయుధంగా మార్చుకుని కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల పేర్లు, పెట్టుబడి అవకాశాలు, ఉద్యోగాల పేరుతో ప్రజలను ఆకర్షించి ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. మొదట చిన్న మొత్తాలను జమ చేసి నమ్మకం కల్పించి, ఆ తర్వాత భారీ పెట్టుబడులు పెట్టిస్తారు. చివరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు దోచుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెన్షన్, రిటైర్మెంట్ నిధులు వారి వద్ద ఉంటాయనే ఉద్దేశంతో ఉచ్చులోకి దింపుతున్నారు. అలాగే ఇంటి వద్ద నుంచే పనిచేసే ఉద్యోగాలు, కాల్ బాయ్ ఉద్యోగాలు, నెలకు రూ.25 వేల వరకు జీతం ఇస్తామని నమ్మబలికి మోసం చేస్తున్నారు.
భయపడొద్దు...
డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్కు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. సీబీఐ, పోలీసు, కస్టమ్స్ అధికారులు అని చెప్పి కేసుల్లో మీ పేరు ఉందని, డబ్బులు చెల్లిస్తే పేరు తొలగిస్తామని బెదిరించినా నమ్మరాదు. వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను నమ్మకూడదు. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు, ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు, టూ–ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించుకోవాలి.
ఇలా ఫిర్యాదు చేయాలి..
సామాజిక మాధ్యమాల్లో తెలియని లింకులు, సందేశాలు, ఫ్రెండ్ రిక్వెస్టులను ఓపెన్ చేయకూడదు. బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలి. cybercrime. gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి.
లోన్ యాప్లు ఖతర్నాక్
డిజిటల్ అరెస్ట్ పేరుతో లక్షల రూపాయలు స్వాహా
పెట్టుబడుల పేరుతో అమాయకులకు టోకరా
బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు
సైబర్ నేరగాళ్లపై దర్యాప్తు ముమ్మరం
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసుల హెచ్చరిక
‘సైబర్’ గాలం..
జిల్లాలో పెరిగిన సైబర్ మోసాలు
లోన్ యాప్ల ద్వారా డబ్బు తీసుకున్న తర్వాత బెదిరింపులకు పాల్పడడం, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించడం, సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి ఫొటోలు, సందేశాలతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. నకిలీ ట్రేడింగ్, లాటరీలు, గిఫ్ట్ స్కీమ్ల పేరుతోనూ మోసాలు చేస్తున్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు ప్రజల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.