విద్యాకుసుమాలకు ఉపకారి | - | Sakshi
Sakshi News home page

విద్యాకుసుమాలకు ఉపకారి

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

విద్యాకుసుమాలకు ఉపకారి ● తన స్వగ్రామమైన పెద పలకలూరులో తన తండ్రి ఏరువ కోటిరెడ్డి పేరు మీద జడ్పీ హైస్కూల్‌కి స్థలం ఇవ్వటంతో పాటు 1998లో పాఠశాల భవనం కూడా నిర్మించి ఇచ్చారు. అంతే కాక ఏడవ తరగతి వరకు ఉన్న అక్కడి పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యను బోధించేందుకు వీలుగా అవసరమైన అన్ని అనుమతులు లభించేలా కృషి చేసి, తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గల తురకపాలెం, చిన పలకలూరు, మల్లవరం తదితర గ్రామాల విద్యార్థులకు ఉపయుక్తంగా తీర్చిదిద్దారు. ● పేద విద్యార్థులకు ఇంకా ఏదో చేయాలని ఒక తలంపుతో 2001 సంవత్సరం నుంచి ఉపకార వేతనాల రూపంలో పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. తొలుత తల్లిదండ్రులు లేని ఒక వంద మంది విద్యార్థులను గుర్తించి ఒక్కొక్కరికి రూ 3వేల చొప్పున ఆర్థిక సాయంతో ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా విద్యార్థుల సంఖ్యను వేలాదిగా పెంచుకుంటూ పోయి తన దాన గుణాన్ని విస్తరించారు. ఇలా 2012 వరకు కొన్ని కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ● 2012 నుంచి మరింత ఎక్కువ మంది విద్యార్థులకు సహాయం అందాలన్న సంకల్పంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలను ఎంచుకొని ప్రతి స్కూలుకు, ప్రతి సంవత్సరం రూ 36వేలు చొప్పున అంటే పదవ తరగతిలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు తలా రూ 5వేలు చొప్పున, 6, 7, 8, 9 తరగతుల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన నలుగురు విద్యార్థులకు తలా వెయ్యి రూపాయలు చొప్పున ఏటా అందిస్తున్నారు. ● అదేవిధంగా తల్లిదండ్రులు లేని లేదా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 20 నుంచి 30 మంది విద్యార్థులకు ప్రతి నెలా రూ.లక్ష ఆర్థికసాయం చేస్తున్నారు. 2012 నుంచి ఇంటర్‌, బీటెక్‌ విద్యార్థులతో పాటు ఎంబీబీఎస్‌, తదితర కోర్సులు చేసే 500 మందికి పైగా విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 5వేలు అందిస్తున్నారు. ఇలా 2012 నుంచి 2025 వరకు లక్షలాది మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించచారు.

విద్యాభివృద్ధికి ఏరువ సాయిరాం విశేష కృషి కోటిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఏర్పాటుకు అంకురార్పణ ప్రతి ఏటా రూ.60 లక్షలకు పైగా మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు ఈ ఏడాది 1600 మందికి అందనున్న ఆర్థిక సాయం నేడు పెదపలకలూరులో ఉపకార వేతనాల పంపిణీ

నేడు ఉపకార వేతనాలు పంపిణీ

గుంటూరు రూరల్‌: ఆయన చిన్నతనంలో చదువుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. తన స్వగ్రామంలో ఏడవ తరగతి వరకే ఉండడంతో సుదూర ప్రాంతానికి వెళ్లి స్కూలు విద్య పూర్తి చేసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా ఆయన నాటి పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేశారు. ఇదంతా గతం! ఇప్పుడాయన ఒక విజయవంతమైన ప్రవాసాంధ్రుడు! అయినా విజయ గర్వంతో పొంగిపోకుండా.. ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ముందుకు సాగుతున్న అతని పేరు ఏరువ సాయిరాం!

కోటిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా..

గుంటూరు రూరల్‌ మండలం, పెద పలకలూరు గ్రామానికి చెందిన ఏరువ సాయిరాం ఉత్తమమైన నడవడికతో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ తాను ఈ స్థాయికి చేరడం వెనుక పడిన కష్టాలను మాత్రం మర్చిపోలేదు. అందుకే తనలా విద్యను అభ్యసించేందుకు ఎవరూ కష్టపడకూడదన్న సదుద్దేశంతో ఏటా వేలాది మంది విద్యార్థులకు తన తండ్రి ఏరువ కోటిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తూ విద్యాదాతగా వెలుగొందుతున్నారు.

ఏరువ సాయిరాం ‘సాక్షి’తో మాట్లాడుతూ, తనలా ఎవరూ విద్య వనరుల కోసం కష్టపడకూడదనే సంకల్పంతోనే తన తండ్రి పేరిట ఏరువ కోటిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది సైతం 1600 మంది విద్యార్థులకు రూ 60 లక్షలు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని బుధవారం ఉదయం పెదపలకలూరులోని శ్రీ చైతన్య పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ పత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కొమ్మసాని శ్రీనివాసులురెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement