రెండు బంగారు పతకాలు, ఒక మెరిట్ సర్టిఫికెట్ ఎఫ్ఐపీ– 2026 కన్వెన్షన్లో ప్రకటన
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యాబోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అన్నారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మంగళవారం డివిజన్ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమంతో పాటు డీఆర్పీలకు జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పట్టాభిపురం, వేణుగోపాల్నగర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మారిన సిలబస్, లీప్ యాప్, తదితర అంశాలపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను డివిజన్ స్థాయిలో శిక్షణ కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బోధించి, పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్ కె.విజయభాస్కర్ మాట్లాడుతూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ రీసోర్స్ పర్సన్, డైట్ అధ్యా పకులు, డీఆర్పీలు పాల్గొన్నారు.
తాడేపల్లిరూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘం నేతలు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకపక్కన రోడ్డుపై కూర్చొని ఉపాధ్యాయులు నిరసన చేస్తుంటే మరోపక్క విధులు నిర్వహించడానికి వచ్చిన అదనపు పోలీస్ సిబ్బంది ఇదేమీ పట్టనట్లు కార్యాలయం కింద పార్కింగ్ ప్లేస్లో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. ధర్నా జరుగుతున్నంత సేపు ఆడుకుంటూ ఉన్నారు. ధర్నా జరుగుతున్నా అటువైపు చూడకుండా ఆటలో నిమగ్నమవ్వడంతో అక్కడి అధికారులు నివ్వెరపోయారు. ధర్నా జరిగే సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పరిస్థితి ఏంటంటూ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. అక్కడున్న విలేకరులు ఫొటోలు తీయడానికి ప్రయత్నించినా వారితో వ్యంగ్యంగా మాట్లాడి క్యారమ్స్ ఆడడం మాత్రం ఆపలేదు.
కార్మికుడి కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో దొండపాడు వద్ద పనిచేస్తూ మట్టి గడ్డలు పడి ప్రమాదంలో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు 21 సంవత్సరాల గుడు సాహూ మృతి చెందడం బాధాకరం అని సీఐటీయూ నాయకులు అన్నారు. ఆ కుటుంబానికి తను పనిచేస్తున్న ఎన్సీసీ కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాజధాని డివిజన్ సీఐటీయూ అధ్యక్ష ,కార్యదర్శులు ఎం.రవి, బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తుళ్లూరు పీహెచ్సీలో ఉన్న గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ బృందం పరిశీలించి, వారి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికులు, వలస కార్మికులకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత సీఆర్డీయేకు, ఏడీసీలకు ఉందన్నారు. రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేందుకు సీఐటీయూ బృందం ప్రయత్నించినా దాటవేసే ప్రయత్నం చేశారని, ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా మభ్యపెట్టాలని చూస్తే భవిష్యత్తలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్మికుడు గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ రాజధాని డివిజన్ కార్యదర్శి బి.లక్ష్మణరావు, నాయకులు జె.నవీన్ ప్రకాష్, పి.బాబురావులు పరిశీలించి, మృతుని బంధువులను పరామర్శించారు.
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్న గుత్తా సునీల్కుమార్కు అరుదైన అవార్డులు లభించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ(ఎఫ్ఐపీ) 9వ గ్రాండ్ నేషనల్ ప్రింట్ సలాన్ కన్వెన్షన్ 2026లో సునీల్ తీసిన ఫొటోలకు అవార్డులు వచ్చాయి. ది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్లో ఒకటి, ది ట్రైబల్ లైఫ్ కేటగిరీలలో మరొకటి లభించాయి. అలాగే మరొక కేటగిరిలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ లభించింది. గతంలో ఎన్నో అవార్డులు, మెడల్స్, ప్రశంసలు అందుకున్న సునీల్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు ఆకాంక్షించారు.


