● జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ పీజీఆర్ఎస్ ● 197 అర్జీలు స్వీకరణ
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. మొత్తం 197 అర్జీలు వచ్చాయి. ఫిర్యాదిదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా పోలీస్స్టేషన్లకు పిలిచి, నిర్దేశిత గడువులోగా విచారించాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్)లు అర్జీలు స్వీకరించారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ (సాయినగర్) ఫిర్యాదిదారులకు అన్నదానం నిర్వహించారు.
దాడికి పాల్పడ్డారు..
నాకు మా నాన్న ద్వారా సంక్రమించిన స్థలం ఉంది. ఈ స్థల వివాదమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే అవతలి వైపు వ్యక్తులు ఇటీవల నాపై దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. నా ప్రత్యర్ధులు నాపై దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని.. చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ప్రయోజనంలేదు. వారిపై చర్యలు తీసుకుని, న్యాయం చేయగలరు.
– షేక్ ఫజల్, పొన్నూరు టౌన్


