గుంటూరుమెడికల్: బీపీ మండల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు వైఎస్సా ర్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగే సమావేశానికి ఆహ్వానించారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏప్రిల్ 19న విజయవాడలోని మాకినేని బసవపునయ్య విజ్ఞాన కేంద్రంలో చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల ఆవశ్యకత అనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశానికి బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని వెల్లడించాలని సజ్జలని కోరారు. దీనిపై సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు అనుకూలమని తెలిపారు. తమ పార్లమెంటరీ పార్టీ గతంలోనే రాజ్యసభలో ఈ విషయం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 19న జరిగే అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ పాల్గొని తమ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే ఓబీసీ సంఘ అధ్యక్షుడు బీవీఎన్ సత్యనారాయణ, నాయకులు ఉన్నారు.


