పట్నంబజారు: ఈనెల 27న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శోభాయాత్ర కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఆహ్వానించారు. రెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో కలిసిన సమితి సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతగుంటూరులోని మణిహోటల్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై గోరంట్ల వరకు జరిగే శోభాయాత్రలో పాల్గొనాలని విన్నవించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పవిత్ర శ్రీరామనవమి రోజున అద్భుతమైన శోభాయాత్రను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. భక్తులంతా ఏకతాటిపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమితి సభ్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహక సమితి సభ్యులు రామరాజు త్రికోటేశ్వరరావు, సాయి, తదితరులు పాల్గొన్నారు.


