విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడి బలి
● విద్యుత్ సరఫరా ఉన్న స్తంభం ఎక్కి
ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
● లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలపై చర్యలు
తీసుకోవాలని బంధువుల డిమాండ్
● మృతుడి కుటుంబాన్ని
ఆదుకుంటామని హామీ ఇచ్చిన
కాంట్రాక్టర్
లక్ష్మీపురం: విద్యుత్ శాఖకు సంబంధించిన లైనుల మరమ్మతులు చేపడుతున్న సమయంలో విద్యుత్ షాక్కు గురైన యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన పగటిపాటి అనిల్కుమార్ (22) ఎలక్ట్రీషియన్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య శ్రావణి, ఒక బాబు ఉన్నారు. రెండు సంవత్సరాలుగా విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద అనిల్కుమార్ పని చేస్తున్నాడు. అరండల్పేట 15/2వ లైనులో గురువారం విద్యుత్ తీగల మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో ఒక ట్రాన్సఫార్మర్ నుంచి సరఫరా ఆగిపోయినా, రెండో ట్రాన్సఫార్మర్ నుంచి సరఫరా అయింది. అనిల్కుమార్ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ అక్కిరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సంబంధిత సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంట్రాక్టర్ వచ్చి మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తానని కాంట్రాక్టరు హామీ ఇచ్చారు. మృతుని భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కుటుంబ సభ్యులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వెంటనే జీజీహెచ్కు చేరుకున్నారు. పోస్ట్మార్టం చేసిన వైద్యులు అప్పటికే వెళ్లిపోయారు. మృతుని కుటుంబ సభ్యులు జీజీహెచ్లో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు వచ్చి వైద్యులతో మాట్లాడి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.


