ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి
11వ అదనపు జిల్లా న్యాయమూర్తి
డి.శ్రీనివాసులు
తెనాలిరూరల్: మార్చి 14వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డి. శ్రీనివాసులు న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. మోటారు వాహన చట్టంలో సుప్రీంకోర్టు చేసిన సవరణల గురించి వివరించారు. సివిల్ అప్పీల్ 9322/2022 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు రోడ్డు ప్రమాద బాధితులకు, వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారం త్వరితగతిన అందేలా, కేసులు సత్వర పరిష్కారినికి దోహపడుతోందని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ చక్కటి వేదిక అని, తద్వారా కక్షిదారుల సమయం, ధనం ఆదా అవుతుందని చెప్పారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలకు మేలు జరుగుతుందన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా న్యాయవాదులు చొరవ చూపాలని కోరారు.
మంగళగిరి టౌన్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కేఎల్రావు కాలనీ బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. కాంక్రీట్ పిల్లర్లపై స్టీలు గడ్డర్లు ఏర్పాటు చేస్తున్న పనుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. 88 గడ్డర్లకు గానూ 20 గడ్డర్ల ఏర్పాటు పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం రూ.70 కోట్ల వ్యయంతో 110 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పుతో అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ను పాత గుంటూరు హైవేకు అనుసంధానం చేస్తూ నాలుగు లైన్ల రహదారిగా ఈ బ్రిడ్జి రూపుదాల్చనుందని పేర్కొన్నారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ శనివారంతో ముగియనుంది. ఫిబ్రవరి 4న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ప్రారంభం నుంచి ప్రతిరోజూ పలువురు ప్రముఖులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఎగ్జిబిషనన్ను సందర్శిస్తూ, వివిధ విభాగాలు ఏర్పాటు చేసిన అనేక ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ప్రతి రోజూ ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడుతూ ఉత్సాహభరితంగా సాగింది. ఇప్పటి వరకు సుమారు 80 వేల మంది ఈ ఎగ్జిబిషనన్ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. సందర్శకులు మరుపురాని వైద్య విజ్ఞాన అనుభూతిని పొందినట్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఎగ్జిబిషనన్ను సందర్శించి, విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి. సుందరాచారిని అభినందించారు. ఫిబ్రవరి 28 చివరి రోజు కావున గుంటూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి విజ్ఞప్తి చేశారు.
ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి


