ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి
ప్రభుత్వ సవతి తల్లి ప్రేమపై తిరుగుబాటు సర్వేల పేరుతో సిబ్బందికి వేధింపులు సమస్యల పరిష్కారానికి ముందుకు రాని ప్రభుత్వం సిబ్బంది కొరతతో వెలవెలబోతున్న సచివాలయాలు జిల్లాలో 568 గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,747 మంది సిబ్బంది
తప్పని పరిస్థితుల్లోనే సమ్మె
గుంటూరు వెస్ట్: ఉద్యోగమంటే అధికారాన్ని చెలాయించడం కాదు.. అది ప్రజలకు సక్రమమైన సేవలందించేందుకే ఉపయోగించాలి.. అతి సాధారణ వ్యక్తికి సైతం తన సమీపంలోనే నాణ్యమైన ప్రభుత్వ సేవలు లభించాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2, 2019లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సుమారు 1,26,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క రూపాయి లంచం లేకుండా, ఏ అధికారి, ప్రజాప్రతినిధి సిఫార్సు లేకుండా భర్తీ చేశారు. అయితే, 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సచివాలయాల పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలో ఉన్న సుమారు 10 వేల మంది వలంటీర్లను తొలగించారు. అప్పట్లో ఒక్కొక్క సచివాలయంలో 11 మంది ఉద్యోగులుండేవారు. ఇప్పుడు కొన్ని సచివాలయాల్లో ముగ్గురు కూడా ఉండడం లేదు. సిబ్బందిపై అనేక సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం పని ఒత్తిడిని పెంచుతోంది. ఏడాదిగా ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం కనీసం పరిశీలన కూడా చేయకపోవడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22 నుంచి సమ్మె చేస్తామని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.
పని భారంతో సతమతం
గుంటూరు జిల్లాలో మొత్తం 568 సచివాలయాలున్నాయి. అందులో 336 గ్రామ, 232 వార్డు సచివాలయాలున్నాయి. వీటిలో 4,747 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 500 పైగా ప్రభుత్వ సేవలందిస్తున్నారు. గతంలో ఒక వలంటీర్కు ఒక క్లస్టర్ అప్పగించారు. ఇప్పుడు ఒక ఉద్యోగికి నాలుగు క్లస్టర్స్ అప్పగించి మితిమీరిన పని భారాన్ని మోపుతున్నారు. ప్రతి జిల్లాలో మూడు విభాగాలుగా సచివాలయ వ్యవస్థను విభజించారు. 2,500 అంతకంటే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాన్ని ఏ విభాగంగా గుర్తించి అందులో ఆరుగురిని నియమించారు. 2,500–3,500 మధ్యలో జనాభా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఏడుగురిని, 3,500 అంతకు మించి ఉన్న జనాభా ప్రాంతాలను గుర్తించి ఎనిమిది మందిని నియమించారు. అయితే, ఉద్యోగ సంఘ నాయకులు వాదన మరో లాగా ఉంది. కొన్ని సచివాలయాల్లో కనీసం ముగ్గురుకూడా లేరంటున్నారు. డెప్యుటేషన్పై ఇతర పనులకు వాడుకుంటున్నారంటున్నారు. ఎనిమిది మంది ఉద్యోగులు, వలంటీర్లు చేయాల్సిన పనిని ముగ్గురు చేయాల్సి వస్తుందని, దీంతో విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. ప్రజలు కూడా నాణ్యమైన సేవలు పొందలేకపోతున్నారని పేర్కొంటున్నారు. మరో పక్క ప్రతి జిల్లా స్థాయి అధికారి సచివాలయ ఉద్యోగులపై అజమాయిషీ చెలాయిస్తుండటం ఇబ్బందిగా మారింది.
అందరూ ఉన్నత చదువులతో ఈ ఉద్యోగాలు పొందాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్ని సేవలు చేయగలడో ఆలోచించడం లేదు. మేము చెబుతుంటే కనీసం వినే నాథుడే లేడు. చాలా బాధగా ఉంది. మా సమస్యలు ప్రభుత్వం కాక ఇంకెవరు తీరుస్తారు ? తప్పని పరిస్థితుల్లోనే సమ్మె బాటకు పిలుపునిచ్చాం. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ముందుకు వచ్చి సమస్య పరిష్కరించాలి.
– పి.మధు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,
ఏపీ సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక
గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విధులు రోడ్లకే పరిమితమయ్యాయి.క్షేత్రస్థాయిలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి 15 రోజుల గడువుతో ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చాం.. అయినప్పటికీ చలనం లేదు.. మరో వారం రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మా సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరాడుతాం.
–షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర కన్వీనర్ ,
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక
నేటి నుంచి సచివాలయ ఉద్యోగుల సమ్మె ?
నేటి నుంచి సచివాలయ ఉద్యోగుల సమ్మె ?