
నిధులు పంచాయతీలకు జమ చేయాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దారి మళ్లించిన నిధులను పంచాయతీలకు జమ చేయాలని వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రూపొందించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమస్యపై సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సర్పంచులు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పంచాయతీలకు రావాల్సిన జనరల్ ఫండ్స్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను తల్లికి వందనం పథకానికి దారి మళ్లించారని చెప్పారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న సర్పంచులు 80 శాతం మంది వైఎస్సార్ సీపీకి చెందిన వారు కావటం వలన పంచాయతీలకు నిధులు ఇవ్వడంలేదని అన్నారు. కనీసం శానిటేషన్ కూడా చేయలేని పరిస్థితి పంచాయతీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకంలో ఉన్న కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సగం కూలీ డబ్బులు తమకి ఇస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారని విమర్శించారు. మీకు ఇంత, మాకు అంత అనే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పేద వాళ్లకు పనిలేకుండా చేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడా ల చక్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీలకు సంబంధించిన నిధులు తల్లికి వందనం వంటి పథకాలకు దారి మళ్లించడం అన్యాయమని అన్నారు. దీనివల్ల ఒక పంచాయతీలో కూడా చిన్నపని కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం కూడా సర్పంచులకు వర్తింపజేయకుండా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. రొంపిచర్ల మండల పార్టీ కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ విభాగం పల్నాడు జిల్లా
అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ