
రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది
చిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్ల మీదకు వస్తే రాష్ట్రం స్తంభించి పోతుందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు చెప్పారు. బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్ష బుధవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రైతాంగ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బర్లీ పొగాకు కలపకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ సిగరెట్లు తయారు కావన్నారు. సువాసన కోసం బర్లీ పొగాకును విదేశాలు సిగరెట్లలో ఉపయోగిస్తాయని తెలిపారు. పొగాకు కంపెనీలు కుట్రపూరితంగా ఏకమై ధరలను పతనం చేసేందుకు బర్లీ పొగాకు కొనుగోళ్లను నిలిపివేశాయని ఆరోపించారు.
ఆ చర్చలకు విలువ లేదా?
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే చర్చలతో సరిపెడుతున్నారని, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన చర్చలకు సైతం విలువలేకుండా పోయిందని వెల్లడించారు. పొగాకు కంపెనీలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది బర్లీ పొగాకు క్వింటా రూ. 18 వేల వరకు కొన్నారని, ఈ ఏడాది కనీసం రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడెల్లా కొనుగోళ్లు చేస్తాం అనడం తప్పించి, అడుగు ముందుకు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలకు రైతులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రైతు సంఘాల నాయకులు తాళ్లూరి బాబురావు, దాసరి వరహాలు, పేలూరి రామారావు, షేక్ సుభాని, ఇంటూరి భవాని వెంకటేష్, దోమల మరియదాసు, రెడ్డమ్మ నరిసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.రాధాకృష్ణ, లోక్ సత్తా మాదాసు భానుప్రసాద్ పాల్గొన్నారు.
నల్లమడ రైతు సంఘం కన్వీనర్
డాక్టర్ కొల్లా రాజమోహనరావు
బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర
కల్పించాలని నిరసన దీక్ష