పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం | - | Sakshi
Sakshi News home page

పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం

May 30 2025 1:27 AM | Updated on May 30 2025 1:27 AM

పవిత్

పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం

తెనాలి: ఆంధ్యా ప్యారిస్‌ తెనాలిలోని బుర్రిపాలెంరోడ్డులో తొమ్మిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఓంకారాశ్రమం ఇప్పుడు పవిత్ర పూజాక్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా స్వార్థపరుల కారణంగా కునారిల్లుతూ వచ్చిన ఆశ్రమమిది. ఆశ్రమ స్థలాన్ని పవిత్ర సందర్శనీయ స్థలంగా చేయాలని గత ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఫలితంగానే ఇప్పుడు ఆశ్రమ స్థలంలో పరివార దేవతా, శిఖర, ధ్వజస్తంభ, శ్రీశరభ సాళ్వేశ్వరస్వామి, శ్రీపార్వతీ సమేత శ్రీఓంకారేశ్వరస్వామి వార్ల ఆలయం నిర్మించారు. ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుంచి ఆరంభించారు. తెనాలి బుర్రిపాలెంరోడ్డులోని ఓంకారాశ్రమం 1932లో ఏర్పాటైంది. కాకుమాను శ్రీరాములు అనే ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆశ్రమాన్ని స్థాపించారు. సాధువులు ధ్యానం చేసుకునేందుకు, వారి పోషణ కోసమనే భావనతో ఏర్పాటైన ఆశ్రమానికి అప్పట్లో శ్రీవ్యాస ఆశ్రమ నిర్వాహకుడు మలయాళస్వామి శంకుస్థాపన చేశారు. ఆశ్రమం తరపున పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య కోసమని దాతలు 12.83 ఎకరాల మాగాణి భూమిని సమకూర్చారు. దాతల లక్ష్యం నిర్విఘ్నంగా నెరవేరింది. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరిగాయి. అప్పట్లో ఆశ్రమానికి స్వామీజీలు ట్రస్టీలుగా ఉండేవారు. 1947–1963 మధ్య ఆశ్రమానికి గల మాగాణి భూమిని విక్రయించారు. ఆ డబ్బుతో గంగానమ్మపేటలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలో రెండు ఇళ్లు, చెంచుపేటలోని గోడౌన్‌ కొనుగోలు చేశారు.

ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు

మలయాళస్వామి మరణంతో ఆశ్రమ ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మొదలయ్యాయి. 1980 వరకు పరంపరగా సాగాయి. అనంతరం ట్రస్టీలు ఏర్పాటైనా 1996లో ఆశ్రమ నిర్వహణ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పట్నుంచి అభివృద్ధి శూన్యమైంది. పైగా 1983లో ఆశ్రమంలో గల ధ్యానమందిరాన్ని కూల్చారు. 1998లో ఆశ్రమ స్థలంలోని 80 సెంట్ల స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు లీజుకిచ్చారు. కోర్టు వివాదంతో ప్రైవేటు విద్యాసంస్థకు లీజు ఆగిపోయింది.

లాడ్జికి అద్దెకు ఇచ్చిన భవనం

శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలోని భవనాన్ని గతంలో కొంతకాలం లాడ్జికి అద్దెకిచ్చారు. కొన్ని నెలలు రిక్రియేషన్‌ క్లబ్‌ కూడా నడిచింది. దేవదాయశాఖ చర్యలతో ఏడాదికి రూ.5.23 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఆశ్రమానికి 2022లో అవుతు శ్రీనివాసరెడ్డి ఈవోగా వచ్చారు. వేలం ఆదాయం పెరిగేలా చూశారు. అప్పట్నుంచి ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఆశ్రమ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. 1.40 ఎకరాల ఆశ్రమం స్థలం ముందుభాగంలో ఆలయం నిర్మాణానికి 2023 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. దేవదాయశాఖ రూ.26.66 లక్షలు, ఆశ్రమ నిధులు రూ.13.34 లక్షలు, దాతల సహకారంతో నిర్మాణం పూర్తయింది.

రేపు ప్రతిష్టా మహోత్సవం

ఈనెల 31వ తేదీన ఉదయం 8.19 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. గురువారం వేదస్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి, సంప్రదాయ పూజలను ఆరంభించారు. రెండురోజుల పూజల అనంతరం 31న యంత్రబింబ, ధ్వజ ప్రతిష్టలు, కళాన్యాసము, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, దేవదాయశాఖ డీసీ కె.బసవ శ్రీనివాసరావు పాల్గొంటారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఆశ్రమంలో ఓంకారేశ్వరస్వామి ఆలయం ఆరంభమైన ప్రతిష్టా మహోత్సవాలు

పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం 1
1/2

పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం

పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం 2
2/2

పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement