
పెండింగ్ కేసులు పరిష్కారంఅయ్యేలా పనిచేయాలి
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల
రేపల్లె: కేసులు పరిష్కరించి కక్షిదారులకు సత్వరమే న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు పనిచేయాలని సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల కోరారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ హాలులో శనివారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పెండింగ్ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో జూలై 7వ తేదీన జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులతోపాటు పరిష్కరించ దగ్గ కేసులను పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలని అన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి.దేవిసాయిశ్రావణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.గీతాభార్గవి, డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, సీఐ మల్లికార్జునరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గరికపాటి వెంకటగిరిధర్, డివిజన్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
మల్లేశ్వరస్వామి సేవలో
అదనపు కమిషనర్
పెదకాకాని: రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనరు తెనాలి చంద్రకుమార్ దంపతులు శనివారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, ఆలయ అర్చకస్వాములు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాలతో అదనపు కమిషనరు దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణలు చేసిన వారు భ్రమరాంబమల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అదనపు కమిషనరు దంపతులకు ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు వేద ఆశ్వీరవచనం చేశారు. తెనాలి చంద్రకుమార్ దంపతులను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
వైభవంగా పునఃప్రతిష్టా మహోత్సవాలు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలంలోని కేఆర్ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో పునఃప్రతిష్టా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు నిత్యపూజావిధులు, వాస్తుపూజ, బలిపర్యగ్నీకరణ విధులు, ప్రభాతబలి, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, జలాధివాసం, క్షీరాధివాసం, అదివాసహోమాలు జరిగాయి. భక్తులు బిందెలతో నీటిని తెచ్చి స్వయంగా విగ్రహాలకు అభిషేకం చేశారు. దేవస్థాన ఈఓ కె.సునీల్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నేడు ఈత శిక్షణ శిబిరం ప్రారంభం
తాడేపల్లి రూరల్: ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి వున్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు (మే 4వ తేదీ ఆదివారం) పిల్లల ఈత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ, కార్యదర్శి యార్లగడ్డ రమేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్తో వున్న స్విమ్మింగ్పూల్లో అసోసియేషన్ లైఫ్ చైర్మన్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, లైలా గ్రూప్ కంపెనీస్ అధినేత గోకరాజు ఆదిత్యవర్మలు పిల్లల ఈత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నారని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు.

పెండింగ్ కేసులు పరిష్కారంఅయ్యేలా పనిచేయాలి