స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి

May 4 2025 6:55 AM | Updated on May 5 2025 10:24 AM

స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి

స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి

చందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారు పురాతన సువర్ణాభరణాల అలంకరణతో స్వర్ణ ప్రకాశరూపిణిగా శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో స్వయంభూవై వెలసిన బగళాముఖి అమ్మవారి వార్షిక కొలుపులు(తిరునాళ్లు) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కొలుపులలో నాల్గవ రోజు అమ్మవారికి పురాతన బంగారు ఆభరణాలను అలంకరించారు. ముందుగా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.భాగ్యలక్ష్మి, ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి పర్యవేక్షణలో బాపట్ల రూరల్‌ సీఐ హరికృష్ణ, ఎస్‌ఐ ఎం.శివకుమార్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహించగా ముఖ్య అతిథులు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, అడిషనల్‌ ఎస్పీ విఠలేశ్వర్‌, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌ గౌడ్‌, పురాతన బంగారు నగల పరిరక్షణ కమిటీ సభ్యులు, పంచాయతీ, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు చందోలు స్టేట్‌ బ్యాంకులో భద్రపరిచి ఉన్న అమ్మవారి పురాతన నగలను బ్యాంకు అధికారుల సమ్మతితో లాకరు నుంచి బయటకు తీసి భక్తుల జయజయ ధ్వానాల మధ్య బ్యాంకు నుంచి శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పురాతన బంగారు ఆభరణాలను అలంకరించారు. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వర్ణాభరణాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగుగొందుతున్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను అందుకున్నారు. అమ్మవారి ఆలయ ముఖమండపం నిర్మించేందుకు 2002 డిసెంబర్‌ నెలలో జరిపిన తవ్వకాలలో దొరికిన పురాతన బంగారు నగలను వార్షిక కొలుపులలో నాల్గవ రోజున మాత్రమే అలంకరించటంతో పురాతన బంగారు నగల అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు తండోప తండాలుగా ఆలయానికి తరలివచ్చారు. భక్తుల దర్శనం అనంతరం అదే రోజు సాయంత్రం తిరిగి బంగారు నగలను పోలీసు బందోబస్తుతో బ్యాంకుకు తీసుకువెళ్లి లాకరులో భద్రపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement