
లక్ష్యానికి చేరుకోని మార్కెటింగ్ శాఖ
కొరిటెపాడు(గుంటూరు): నిర్దేశిత లక్ష్యానికి చేరకుండానే మార్కెటింగ్ శాఖ చతికిలపడింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గుంటూరు జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా రూ.133.69 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో 88.16 శాతంతో రూ.117.87 కోట్లు వసూలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.రాజబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పొన్నూరు మార్కెట్ యార్డు రూ.6.95 కోట్లకు గానూ 105.64 శాతంతో రూ.7.34 కోట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచింది. దుగ్గిరాల 104.06 శాతం, ప్రత్తిపాడు 102.16 శాతం, తెనాలి 101.67 శాతం సాధించి లక్ష్యాన్ని చేరుకున్నాయి. తాడికొండ మార్కెట్ యార్డు లక్ష్యం రూ.2.10 కోట్లు కాగా, 90.67 శాతంతో రూ.1.90 కోట్లకు పైగా వసూలు చేసి లక్ష్యానికి చేరువగా నిలిచిపోయింది. మిగిలిన వాటిలో గుంటూరు మార్కెట్ కమిటీ 85.74 శాతం, ఫిరంగిపురం 78.65 శాతం కాగా, ఆఖరి స్థానంలో మంగళగిరి మార్కెట్ కమిటీ 73.96 శాతంతో లక్ష్యానికి ఆమడదూరంలో ఆగిపోయింది. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా మార్కెటింగ్ శాఖకు రూ.146.31 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఏడీఎం తెలిపారు. ఇందులో అత్యధికంగా గుంటూరు మార్కెట్ కమిటీకి రూ.115 కోట్లు టార్గెట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెనాలి మార్కెట్ కమిటీకి రూ.7.65 కోట్లు, దుగ్గిరాల రూ.3.75 కోట్లు, పొన్నూరు రూ.8.38 కోట్లు, మంగళగిరి రూ.3.03 కోట్లు, ఫిరంగిపురం రూ.1.88 కోట్లు, తాడికొండ రూ.2.17 కోట్లు, ప్రత్తిపాడు మార్కెట్ కమిటీకి రూ.4.45 కోట్లు లక్ష్యం విధించినట్లు ఆయన వివరించారు.
88.16 శాతంతో సరి

లక్ష్యానికి చేరుకోని మార్కెటింగ్ శాఖ