మీ ప్రకృతి ప్రేమ నిజమే అయితే...

TUF Vimalakka Guest Column On Natural Farming - Sakshi

సందర్భం

ప్రకృతి వ్యవసాయం – రక్షిత ఫలసాయం అంటూ ఈ యేడు మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహి స్తుండటంతో రైతాంగంలో, మేధావుల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని అనేక మంది రచనలు పంపించారు. ప్రకృతి వ్యవసాయం లేదా తరతరాలుగా మనం అనుసరిస్తున్న సాంప్రదాయిక సహజ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తే ఐదు రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 లోనే ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజనా’ పథకం కింద సబ్సిడీలు ప్రకటించింది. అయితే రసా యన ఎరువులు, పురుగుమందులు పూర్తిగా నిషే ధించి నేలతల్లినీ, ప్రజారోగ్యాన్నీ రక్షించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. శ్రీలంక ప్రభుత్వం, సిక్కిం రాష్ట్రం ప్రమాదకర రసాయన వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించాయని విన్నాము. ‘భార తీయ ప్రకృతి కృషి పద్ధతి’ కింద ఆంధ్రప్రదేశ్‌ , కేరళ రాష్ట్రాల్లో 2 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని కొన్ని గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా  తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనీ, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా దీన్నొక పాఠ్యాంశంగా చేర్చాలనీ డిమాండ్‌ చేస్తున్నాం.

‘ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రి కల్చర్‌ మూవ్‌మెంట్‌’ గణాంకాల ప్రకారం 2018– 19లో భారతదేశంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం సాగుతున్నది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలో చైనా మూడవ స్థానంలో, అమెరికా ఏడవ స్థానంలో ఉండగా మనం 9వ స్థానంలో నిలిచాము. కాబట్టి ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన’ కింద ఎంతమంది రైతాంగానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందిందో ప్రకటించాల్సిన అవసరం ఉంది. పరంపరాగత వ్యవసాయానికి పరం పరగా వస్తున్న దేశీయ విత్తనాలు, బహుళ పంటలు ముఖ్యమైన వనరు. అలాంటి నాటు విత్తనాలను కాపాడి చిన్న, సన్నకారు రైతాంగానికి అందించాలి. కౌలు రైతులకు స్వయంగా సాగు చేసుకునే భూములు అందించడం ముఖ్యమైనది. కాబట్టి వేలాది ఎకరా లను హస్తగతం చేసుకున్న జమీందారీ, జాగిర్దారీ వ్యవస్థల్లాగా బహుళజాతి కంపెనీలకు రకరకాల పేర్ల పైన వేలాది ఎకరాలు అప్పగించరాదు. ప్రభుత్వ భూముల అమ్మకానికి చేసిన జీవోలను రద్దు చేసి రైతులకు భూపంపిణీ జరగాలి. 

చారిత్రక కడివెండి గ్రామంలో ‘దున్నేవారికి దుక్కులు – దుక్కుల్లో ప్రకృతి మొక్కలు’ అంటూ బహుజన బతుకమ్మ పిలుపు నిచ్చింది. అంతకు ముందే ఆలగడపలో సెజ్‌ల కోసం ప్రజల సాగు భూములను సేకరించవద్దని వేలాది ప్రజల సమ క్షంలో బహుజన బతుకమ్మ ఆడి పాడి చాటి చెప్పింది. బాబాసాహెబ్‌ ప్రవచించినట్లు ‘ఆర్థిక ప్రజా స్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం’ అమలు జరగా లంటే సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా వనరుల వికేంద్రీకరణ జరగాలి. వ్యవసాయం, చేతి వృత్తులు జంటగా అభివృద్ధి కావాలి. అందుకే భూసా రాన్ని కాపాడుకోవడానికి క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ స్కీమ్‌ స్థానంలో మొత్తంగా రసాయన ఎరు వులు, క్రిమిసంహారక మందులను అరికట్టే నిర్ణయం తీసు కోలేరా? ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పడమే నిజమైతే పురుగు మందుల కంపెనీలు చేసే ప్రచారాన్నయినా ఎందుకు అరికట్టలేక పోతున్నారు? పాడి–పంట–పెంట విధానాల ద్వారా ఇంటింటికో ఎరువుల కర్మాగారం, పాడి ఉత్పత్తుల అభివృద్ధి, సాంప్రదాయక ఇంధన వనరుల అభివృద్ధి దిశగా పథక రచనలు జరగాలి. దేశీయ సహజ వనరులపై పిడికెడు మంది గుత్తాధిపత్యాన్ని నివారించగలిగి నప్పుడే ఈ దిశగా నిజమైన ప్రయాణం మొదల వుతుంది. 

విమలక్క 
బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున...
మొబైల్‌ : 88868 41280

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top