నిరసన అంటే నిజం చెప్పడమే... | Sakshi Guest Column On Andhra Pradesh Police | Sakshi
Sakshi News home page

నిరసన అంటే నిజం చెప్పడమే...

Jun 21 2025 5:07 AM | Updated on Jun 21 2025 6:04 AM

Sakshi Guest Column On Andhra Pradesh Police

నిరసన అనేది పాలకులకు ప్రజలు నిజం చెప్పడానికి ఉన్న ఒక బలమైన మార్గం. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగమిది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అసమ్మతి, నిరసన అనేది ఒక సేఫ్టీ వాల్వ్‌ అని జస్టిస్‌ చంద్రచూడ్‌  వ్యాఖ్యానించారు. 

నిజానికి, ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అనేక సామాజిక ఉద్యమాలకు నిరసనలు అత్యంత శక్తిమంతమైన చోదక శక్తిగా ఉన్నాయి. ఈ నిరసనలు ప్రభుత్వాలు చేసే అన్యాయం, దుర్వినియోగాన్ని  బట్టబయలు చేస్తున్నాయి. పాలకుల నుంచి జవాబుదారీతనం కోరుతున్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ఆశతో ఉండటానికి నిరసనలే ప్రజలకు దిక్సూచిలుగా కనిపిస్తున్నాయి. 

కానీ దురదృష్టవశాత్తు, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం ప్రసాదించిన ఇతర హక్కులతో పాటు ఈ హక్కూ దాడికి గురవుతోంది. ప్రశ్నించే గొంతులను కర్కశంగా అణిచివేస్తున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, జీవించే హక్కు, దోపిడీని నిరోధించే హక్కులకు భంగం కలిగిస్తున్నారు. 

రాజ్యాంగానికి లోబడే నిష్పక్షపాతంగా పనిచేస్తామన్న పాలకుల ప్రమాణాలు ఆచరణలో కనిపించడం లేదు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ద్వారా నాయకుల నిరసనలను వారి పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. 

ప్రజలలో వస్తున్న మార్పుకు ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా? అనే చర్చ ప్రారంభమైంది. నిరసనలను అడ్డుకోవడమంటే నిజాలన్నింటినీ దాచేందుకు ప్రయత్నిస్తున్నారనే అర్థంకాక మరేమిటి? ఈ నిరసన గొంతుకలను నొక్కేసేందుకు పోలీసు వ్యవస్థ నానాటికీ వింతపోకడలకు దిగుతోంది. టీవీ లైవ్‌ షోలో విశ్లేషకుడి మాటలను సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి అన్వయించి పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయడం దీనికి ఓ సంకేతం. 

అయితే దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించి ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘లైవ్‌ షోలో విశ్లేషకుడి మాటలను యాంకర్‌కు ఎలా అన్వయిస్తారు? నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే విచారణల సందర్భంగా మేము కూడా నవ్వుతుంటా’మని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 

అత్యంత కీలకమైన వాక్‌ స్వాతంత్య్రపు హక్కును పరిరక్షించాలని పోలీసులకు, ప్రభుత్వానికి హితవు పలికింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఏపీ పోలీసులు రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పౌరుల హక్కులను కాలరాస్తున్న వైనం తేటతెల్లమైంది. పాలకుల మెప్పు కోసం పోలీసులు చట్ట విరుద్ధంగా చేసే ఇలాంటి చర్యలను ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు చెక్‌ పెడుతూనే వస్తోంది.

భారతదేశంలో పోలీసు సంస్కరణలు అత్యవసరమని ‘ప్రకాష్‌ సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. పోలీసుల హింసను అరికట్టేందుకు అనేక అంశాలను సూచించింది. దుష్ప్రవర్తనకు పాల్పడే పోలీసులను జవాబుదారీ చేయాలని వెల్లడించింది.  

పోలీసులు చట్టబద్ధంగానే అరెస్టులు చేయాలని, ఏకపక్ష నిర్బంధం సరికాదని సూచనలు చేసింది. ఎందుకంటే ఇవి తీవ్రమైన కస్టోడియల్‌ హింసకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిష్క్రియాత్మకంగా ఉన్నాయి. ఫలితంగా పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం లోపిస్తోంది. 

నిజానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, నిరసనలు ప్రకటించడం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. ఆర్టికల్‌ 19 కింద పౌరులకు వాక్‌ స్వాతంత్య్ర హక్కు, సంఘాలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించుకునే హక్కును రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. భిన్నాభిప్రాయాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్‌ లాంటివని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అభివర్ణించారు. 

అంతేకాదు, భిన్నాభిప్రాయాలను అణచివేయాలని చూడటం, ప్రజలలో భయాన్ని సృష్టించడం కచ్చితంగా వ్యక్తిగత స్వేచ్ఛనూ, రాజ్యాంగ విలువలనూ ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.  నిజానికి నిరసన ద్వారానే వివక్ష, అన్యాయాల నుంచి ప్రజలకు విముక్తి పొందే మార్గం దొరుకుతుంది. అసమానతల, అన్యాయాల సంకెళ్లను తెంచి సమానత్వాన్నీ, స్వేచ్ఛనూ సాధించేందుకు ఉపకరిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఏపీలో రాజకీయ ద్వేషాలతో ఈ నిరసన హక్కు ప్రమాదంలో పడింది.

– వెంకటేష్‌ నాగిళ్ల, డిప్యూటీ ఇన్‌పుట్‌ 
ఎడిటర్, సాక్షి టీవీ, ఢిల్లీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement