అవును... చరిత్ర వక్రీకరణ మహానేరం!

Raka Sudhakar Rao Write on September 17, Telangana Liberation Day - Sakshi

‘చరిత్ర వక్రీకరణ మహానేరం’ పేరిట  సెప్టెంబర్‌ 22 నాటి మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసాన్ని చదివిన తరువాత వక్రీకరణ వాస్తవంగా ఎక్కడ, ఎలా మొదలౌతుందో అర్థమైంది. దేశ విభజనానంతరం సంస్థానాల విలీనం విషయంలో  ఒక అబద్ధం ప్రచారమౌతోంది. సంస్థానాధీశులకు భారత్‌లో కలిసేందుకు, లేదా పాకిస్తాన్‌లో కలిసేందుకు, లేదా స్వతం త్రంగా ఉండేందుకు బ్రిటిషర్లు అధికారాన్ని కల్పించారనేది అబద్ధం. బ్రిటిష్‌ ప్రభుత్వం వారికి భారత్‌ లేదా పాకిస్తాన్‌లో విలీనమయ్యే అవకాశాన్ని మాత్రమే కల్పించింది. స్వతంత్రంగా ఉండేలా మూడో ఆప్షన్‌ లేదు. అలా ఉన్నట్టయితే దయతో తదనుగుణమైన బ్రిటిష్‌ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించాలి (ఏ ఆధారమూ చూపని కొన్ని ఇంగ్లీషు పుస్తకాలను కోట్‌ చేస్తే సరిపోదని సవినయ మనవి).

బ్రిటిషర్లు విలీనానికి మతంతో కూడా ముడిపెట్టలేదు. ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ కంటిగ్యుటీ (సామీప్యతా సూత్రం) అంటే భారత్‌ సమీపంగా ఉంటే భారత్‌లో, పాకిస్తాన్‌ సమీపంలో ఉంటే పాకిస్తాన్‌లో ఉండేలా నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రకారం హిందూ జనాభా అధికంగా ఉండి, హిందూ రాజు ఉన్న రాజస్థాన్‌లోని అమర్‌ కోట్‌ సంస్థానం పాకిస్తాన్‌లో చేరింది. కశ్మీర్‌ తప్ప మిగతా సంస్థానాధీశులు వారు కోరుకున్నా పాకిస్తాన్‌లో విలీనం కాలేరు. కాబట్టి భారతదేశం లోపల ఉండే హైదరాబాద్‌ స్వతంత్రంగా ఉండే ఆప్షన్‌ లేనే లేదన్నది స్పష్టం. మౌంట్‌ బాటన్‌ స్వయంగా ఈ విషయాన్ని నిజాంకి, ఆయన ప్రతినిధులైన వాల్టర్‌ మాంక్టన్, నవాబ్‌ ఆఫ్‌ ఛత్తారీలకు పలుసార్లు స్పష్టం చేశాడన్నది చారిత్రక వాస్తవం. నిజాం చేసుకున్న యథాతథస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఒప్పందం) కూడా స్వతంత్రంగా ఉండేందుకు కాదు. విలీనాన్ని ఒక సంవత్సరం జాప్యం చేసేందుకే.

పాకిస్తాన్‌ అన్న ఆలోచనను బ్రిటిషర్ల సహకారంతో 1930వ దశకంలో సృష్టించిన చౌధురీ రహమత్‌ అలీ భారత్‌లో మూడు ముస్లిందేశాలు ఉండాలని ప్రతిపాదించాడన్నది మరిచిపోరాదు. మొదటిది పాకిస్తాన్‌. రెండవది నేటి బంగ్లాదేశ్‌. దానిని బంగిస్తాన్‌ అన్నాడు. మూడవది ఉస్మానిస్తాన్‌. అంటే హైదరాబాద్‌. ఉస్మానిస్తాన్‌ ఆలోచన వెనుక దాగున్న మతోన్మాద సూత్రాన్ని మరిచిపోరాదు. పాశ్చాత్య కూటమిలో చేరకూడదన్న భారత నేతల నిబద్ధతాపూర్వకమైన నిర్ణయం వల్లే బ్రిటిషర్లు భారత్‌ను దిగ్బంధనం చేసేందుకు పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున తూర్పు పాకిస్తాన్‌ (తరువాత బంగ్లాదేశ్‌), ఉత్తరాన ముస్లిం జనాధిక్య జమ్మూ కశ్మీర్‌ సంస్థానం, దక్షిణాన ఉస్మానిస్తాన్‌ ఏర్పాటయ్యేలా ప్రయత్నించారు. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్న నిజాం కుట్రలకు ఫ్రాన్స్, అమె రికా, కొలంబియా, కెనడా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి పాశ్చాత్య కూటమి దేశాలు అందుకే సమర్థించాయి. రష్యా, చైనా, యుక్రేన్‌ వంటి కమ్యూనిస్టు దేశాలు భారత అలీన విధానాన్ని సమర్థించి, ఈ సామ్రాజ్యవాద యత్నానికి పురిట్లో సంధికొట్టాయి.

లక్ష్మయ్య సర్వసాధారణ కమ్యూనిస్టులందరిలాగానే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డిలను ప్రస్తావించారు. కానీ జటప్రోలు, రెంటచింతల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, పాల్వంచ, సంస్థాన్‌ నారాయణపూర్‌ వంటి ఉప సంస్థానాల్లో విస్నూరు, మానుకోటల్లో లాగా ఎందుకు తిరుగుబాటు రాలేదో ప్రస్తావించలేదు. ఆదిలా బాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌ నగర్‌ వంటి తెలంగాణ జిల్లాల్లో, ఆనాడు హైదరాబాద్‌ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న మరాఠ్వాడా ప్రాంతాలైన బీడ్, పర్భనీ, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్‌లలో, కళ్యాణ కర్ణాటక లోని బీదర్, రాయచూర్, గుల్బర్గాలలో సంస్థానాధీశులు లేరా? కొంత నల్గొండ, కొంత వరంగల్, కాసింత రంగారెడ్డి జిల్లాకి మాత్రమే ప్రధానంగా పరిమితమైన కమ్యూనిస్టుల పోరాటం ఈ మరాఠ్వాడా, హైదరాబాద్‌ కర్ణాటక  ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదు?

మల్లె్లపల్లి లక్ష్మయ్య కన్వీనియంట్‌గా ప్రస్తావించని మరో విషయం ఉంది. ఘనత వహించిన నిజాం ప్రభువు 1943లో కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారు? దాశరథి రంగాచార్య తన ‘జీవన యానం’లో, వందేమాతరం రామచంద్రరావు తన ‘హైదరాబాద్‌పై పోలీసు చర్య’లో సెప్టెంబర్‌ 17 తరువాత రజాకార్ల ఆయుధాలన్నీ కమ్యూనిస్టుల చేతికి చేరాయని రాశారు. కమ్యూనిస్టులు దీనిని ఎందుకు ఖండించరు? సెప్టెంబర్‌ 17, 1948 తరువాత 1951 వరకూ కమ్యూనిస్టులు ఎవరిపై సాయుధ పోరాటం చేశారు? లేని నిజాంపైనా? ఉన్న భారత ప్రభుత్వం పైనా? భారత సేనలు అన్న పదానికి బదులు ‘యూనియన్‌ సేనలు’ అనే పదాన్ని ఉపయోగించి భారత వ్యతిరేక పోరాటానికి ఎందుకు రంగులద్దుతున్నారు?

రావి నారాయణ రెడ్డి ఈ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు. ప్రజలు భారత ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నా దానిపై పోరాటం చేయడం సరైనది కాదని చెప్పారు. సుందరయ్య–బసవపున్నయ్య–చండ్ర రాజేశ్వర త్రయం దానిని తోసిపుచ్చారు. ఈ మొత్తం ఉదంతాన్ని చాపకిందకి తోసి, సగం చరిత్ర చెప్పడానికి కారణమేమిటి? హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్నది కమ్యూనిస్టుల లక్ష్యం. 1948–1951 వరకూ భారత్‌పై కమ్యూనిస్టులు పోరాడి, భారత ప్రభుత్వం పంపిన రాయబారి ద్వారకానాథ్‌ కాచ్రూను కలవడానికి నిరాకరించి, ఆ తరువాత 1952లో ఎలాంటి గ్యారంటీలూ పొందకుండానే, ఏమీ సాధించకుండానే మూడేళ్ల రక్తసిక్త పోరాటం ఆపి, ఎన్నికల్లో పాల్గొని తగుదునమ్మా అంటూ ఎంపీలు అయ్యారు.

మరో అవాస్తవం సుందర్‌ లాల్‌ కమిటీ గురించి. దానిని భారత ప్రభుత్వం కానీ, కాంగ్రెస్‌ పార్టీ కానీ, నిజాం ప్రభువు కానీ నియమించలేదు. అది నెహ్రూ వ్యక్తిగతంగా పంపిన సుహృద్భావ ప్రతినిధి బృందం. పండిత్‌ సుందర్‌ లాల్, కాజీ మహ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌లతో కూడిన ఈ బృందం ముస్లింలను కలిసి, భారత ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టబోదని నమ్మకం కలిగించింది. (క్లిక్ చేయండి: పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?)

వాస్తవానికి హైదరాబాద్‌ సంస్థాన చరిత్రను మూడు వేర్వేరు ముక్కలుగా చదువుతున్నాం. కర్ణాటకలోని మూడు జిల్లాలు, మరాఠ్వాడాలోని జిల్లాల చరిత్రను తెలంగాణ చరిత్రతో కలిపి చదివితేనే సమగ్రత వస్తుంది. లేని పక్షంలో గుడ్డివాళ్లు ఏనుగుని వర్ణించినట్టు చదవడం జరుగుతుంది. అలా చేసినంత కాలమూ రెండు మూడు జిల్లాల చరిత్రనే మొత్తం 82 వేల చ.కి.మీ. వైశాల్యమున్న, కోటికి పైగా జనాభా ఉన్న, 17 జిల్లాలున్న సువిస్తృత సంస్థాన చరిత్రగా లక్ష్మయ్య గారు భ్రమించినట్టు భ్రమించడం జరుగుతుంది. (క్లిక్ చేయండి: చరిత్రను కాటేయ జూస్తున్నారు!)


- కస్తూరి రాకా సుధాకర రావు 
సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top