
ఈ వారం అన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికలూ, ఛానళ్లూ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఎన్కౌంటర్ వార్తతో, అనుబంధ వార్తలతో, వ్యాఖ్యా, విశ్లేషణా వ్యాసాలతో నిండిపోయాయి. సామాజిక మాధ్యమాలైతే చెప్పనక్కరలేదు. ఒక సుప్రసిద్ధ ప్రధాన స్రవంతి ఇంగ్లిష్ దినపత్రిక ఆ వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురిస్తూ, ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో ఆ మూడు కాలమ్ల వార్తకు పక్కనే మరొక రెండు కాలమ్ల వార్త కూడా వేసి... చాలా పెద్దవయ్యాయి గనుక రెండు వార్తలనూ రెండో పేజీలో కూడా పక్కపక్కనే కొనసాగించింది. ఆ రెండు వార్తల మధ్య కార్య కారణ సంబంధం ఉండడం ఆ పత్రిక చెప్పకుండానే చెప్పిన రహస్యం. ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత వల్ల పద్దెని మిదేళ్లుగా ఆగిపోతున్న ఆ ‘అభివృద్ధి’ పథకాన్ని కొనసాగించడం గురించి వార్తా, మావోయిస్టు ప్రధాన కార్యదర్శిని చంపి వేసిన వార్తా పక్కపక్కనే కలిసి రావడం ఒక తలకిందుల కవితాన్యాయం.
మహారాష్ట్ర లోని మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలిజిల్లాలో ఇనుప ఖనిజం శుద్ధి కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖమే 12న అనుమతి ఇచ్చిందనేది ఆ వార్త. ఒకవైపు ‘ఆపరేషన్ కగార్’ పేరిట ఎడాపెడా ఎన్కౌంటర్లు జరుపుతూ ఆది వాసులను భయోత్పాతంలో ముంచుతున్న సందర్భంలోనే ఈ అనుమతి వచ్చిందని ప్రత్యేకంగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ముందు మహారాష్ట్ర మంత్రివర్గం గడ్చిరోలీ జిల్లా గనుల తవ్వకపు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసిందని కూడా ఆ వార్తలోనే ఉంది. మావోయిస్టు నిర్మూలన, ఆదివాసుల తరలింపు అనే ప్రణాళిక దండకారణ్యంలోని ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికే అనే ఆరోపణను నిజం చేస్తూ, ఈ శుద్ధి కర్మాగారం కోసం భారత ప్రభుత్వం ‘లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్’ అనే బహుళజాతి కార్పొరేట్ సంస్థకు 2,324 ఎకరాల అడవిని ధారాదత్తం చేసింది. ఈ ‘అభివృద్ధి’ కింద ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికి వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్
నిజానికి ఈ కంపెనీకి ఇక్కడ 2007లోనే ఇరవై సంవ త్సరాల లీజు కింద వెయ్యి ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఆ లీజు వ్యవధిని మరొక ముప్పై సంవత్సరాలు పెంచారు. అంటే ఆ కంపెనీ ఇక్కడి ఖనిజ వనరులను 2057 వరకూ తవ్వుకుపోవచ్చు. అయితే ఆ ప్రాంతంలో ఆదివాసులు తమ ‘జల్, జంగల్, జమీన్’లను కార్పొరేట్లకు ఇవ్వడానికి అంగీకరించబోమని, అలా ఇవ్వడం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో, ‘1996 పంచా యత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం’లో, ‘2006 అటవీ హక్కుల చట్టం’లో ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటానికి మావోయిస్టులుఅండగా నిలిచారు. ఆ కారణం వల్లనో, మరే కారణం వల్లనో లాయిడ్ స్టీల్ కంపెనీ 2016 దాకా తవ్వకాలు ప్రారంభించలేకపోయింది. 2016లో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత మరింత క్రియాశీలంగా మారి 2016 డిసెంబర్లో సుర్జాఘర్ గనుల దగ్గర లాయిడ్ కంపెనీకి చెందిన ట్రక్కులను, ఎర్త్ మూవర్లను తగులబెట్టడంతో గనుల తవ్వకం ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఆగిపోయిన గనుల తవ్వకానికి, అదనంగా అక్కడే ఒక శుద్ధి కర్మాగారం పెట్టుకోవడానికి అనుమతు లిచ్చా రన్నమాట. ఆ వార్త కూడా సరిగ్గా మావోయిస్టు కార్యదర్శి చని పోయిన రోజు ప్రకటించారన్నమాట. ఇప్పుడు ఇస్తున్న అనుమ తులకు కాగితం మీద కొన్ని షరతులు ఉన్నమాట నిజమే. ఇక్కడ ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికినందుకు, 2,400 ఎకరాల అడవిని నాశనం చేసినందుకు, అక్కడి నుంచి వెయ్యి కి.మీ. అవతల అరేబియా సముద్ర తీరంలో చిప్లున్, రత్నగిరి ప్రాంతాల్లో సమానమైన విస్తీర్ణంలో మొక్కలు నాటాలని ఒక షరతు ఉంది. ఇటువంటి అడవిని నరికే అనుమతులు పొందిన వారందరికీ అటువంటి షరతులు ఉండడమూ, వాటిని తుంగలో తొక్కి, భయంకరమైన ఉల్లంఘనలను ఆమోదించడమూ దశాబ్దాలుగా యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి.ఇలా అడవిని పందారం చెయ్యడం ఆదివాసుల హక్కులకు మాత్రమే కాదు... దేశ సంపదకు, ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు, పర్యావరణానికి, భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదకరం. ఈ గడ్చిరోలి అడవి మహారాష్ట్రలోకి విస్తరించిన దండకారణ్యంలో భాగం.
చదవండి: అరుదైన ఆపరేషన్.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!
దండకారణ్యం దేశానికే ఊపిరితిత్తుల వంటిది. అక్కడ ఆ సువిశా లమైన, దట్టమైన అరణ్యాలు ఉండడం వల్లనే దేశంలో జీవ వైవిధ్యం మిగిలి ఉంది. అక్కడ పుట్టిన అనేక నదులు దేశంలో, కనీసం మధ్య భారతంలో భూగర్భ జలాలను రక్షిస్తున్నాయి. ఆ అడవి సువిశాల ప్రాంతాలకు ప్రాణవాయువును అందిస్తున్నది. పర్యావరణ రీత్యా ఇంత సుసంపన్నమైన ఈ అడవిలో దాదాపు ముప్పై ఖనిజాలు కోట్లాది టన్నులు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ఖనిజ నిలువలు దేశ సంపద. దాన్ని పొదుపుగా వాడుకుని, భవిష్యత్త రాలకు అందించడం ఈ తరం బాధ్యత. ఐదేళ్ల కోసం అధికారం పొందినవారు యాభై ఏళ్ల భవిష్యత్తును కార్పొరేట్ లాభాపేక్షకు, ఆశ్రితులకు రాసి ఇస్తున్నారు. ఆ సంపద కొల్లగొట్టడానికి అక్కడి నుంచి ఆదివాసులను ఖాళీ చేయించదలచారు. ఆదివాసులకు మద్దతుగా ఉన్న ఉద్యమకారులను నిర్మూలించ దలచారు. ఆదివాసుల మీద ప్రభుత్వాలు, కార్పొరేట్లు, మైదాన ప్రాంతవాసులు దాడి చేసి జాతులకు జాతులనే అంతరింపజేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది గనుకనే, భారత రాజ్యాంగం ఐదవ, ఆరవ షెడ్యూళ్లలో ఆ ప్రాంతాలకు, ఆ ప్రాంతాలలోని ఆదివాసులకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. ‘పేసా చట్టం –1996’లో, ‘ఎఫ్ఆర్ ఏ చట్టం –2006’లో ఆ రక్షణలను విస్తరించింది. ఇప్పుడు జరుగుతున్న ఈ అడవుల పందారం ఆ చట్టాలన్నిటి ఉల్లంఘన. ఇది కేవలం మావోయిస్టుల సమస్యో, ఆదివాసుల సమస్యో కాదు. ఇది ఈ దేశంలో ప్రతి ఒక్కరి సమస్య. ఈ దేశాన్ని ప్రేమించేవారందరి సమస్య.
-ఎన్ వేణుగోపాల్
‘వీక్షణం’ ఎడిటర్