అభిప్రాయం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన, కానీ అత్యంత ప్రభావవంతమైన మార్పు జరుగుతోంది. ఒకప్పుడు చమురు నిల్వలు ప్రపంచ రాజ కీయాలను ప్రభావితం చేశాయి. తర్వాత సాంకేతికత, డిజిటల్ ఆధిపత్యం ప్రపంచ శక్తి సమీ కరణాలను మార్చాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని అరుదైన ఖనిజాలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ సరఫరా గొలుసులు ఆక్రమిస్తున్నాయి. ఈ కొత్త యుగంలో ఎవరైతే ముడి పదార్థాలు, వాటి శుద్ధీకరణ, ఉత్పత్తినియంత్రణను తమ చేతుల్లో ఉంచుకుంటారో వారే భవి ష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయ గలుగుతారు.
ఇలాంటి సమయంలో చైనా తీసుకుంటున్న తాజా ఎగుమతి నియంత్రణ చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షి స్తున్నాయి. అమెరికా–చైనా వ్యూహాత్మక పోటీ తీవ్రమవు తున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటన ముగిసిన కొద్ది రోజులకే చైనా తన కీలక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, అరుదైన ఖనిజాలు, అధునాతన పరిశ్రమలకు అవసరమైన సరఫరాలపై నియంత్రణలను కఠినతరం చేస్తూ, రాజ్య ఆదేశాలు 834, 835 విడుదల చేసింది. ఈ చర్యలు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నాయి – తయారీ కేంద్రంగా మాత్రమే కాదు, సరఫరా నియంత్రణ కేంద్రంగా కూడా చైనా తన స్థానం బలపరచుకోవాలని చూస్తోంది.
ఇలాంటి చట్టాలు యూరోప్, ఆమెరికాలలో ఉన్నా, అవి, అత్యున్నత సాంకేతిక కలిగిన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటి వరకు అమెరికా సెమీకండక్టర్ టెక్నా లజీ, అధునాతన చిప్ల ఎగుమతిపై నియంత్రణలు విధిస్తూ వచ్చింది. ఇప్పుడు చైనా తనకు ఉన్న బలాన్ని– రేర్ ఎర్త్ శుద్ధీకరణ, ఎలక్ట్రానిక్ సరఫరా వ్యవస్థ, ముడి పదార్థాల ఆధిపత్యాన్ని వ్యూహాత్మక సాధనంగా ఉపయో గించడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలపైనే కాదు; చైనా సరఫరా గొలుసులపై అధికంగా ఆధారపడిన భారతదేశంపైనా పడే అవకాశం ఉంది. భారతదేశ ఎలక్ట్రానిక్ దిగు మతులు 80 శాతానికి పైగా చైనా నుండే అని గమనించాలి. చైనా ఒత్తిడితోనే, ఫాక్స్కాన్, టెస్లా లాంటి సంస్థలు, తమ ఉత్పత్తులను భారతదేశం బయటే చేయాలని నిర్ణయించు కొన్నాయి.
ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగాలపై ప్రభావం
భారతదేశం ఒక అసౌకర్యకరమైన వాస్తవాన్ని అంగీకరించాలి. మనం తయారీ కేంద్రంగా ఎదుగుతున్న ప్పటికీ, ఆ తయారీకి అవసరమైన కీలక భాగాలు, అరుదైన ఖనిజాలు, చిప్ భాగాలు, పరిశ్రమల సరఫరా వ్యవస్థల విషయంలో ఇంకా విదేశాలపై ఆధారపడి ఉన్నాం. ప్రత్యేకంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాల విషయంలో భారత స్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఇవే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థలు, బ్యాటరీ నిల్వలు, అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ పరికరాలకు ప్రాణాధారం. ఈ రంగాల్లో సరఫరా అంతరాయం అంటే కేవలం పరిశ్రమల సమస్య కాదు; అది దేశ ఆర్థిక భద్రత సమస్యగా మారుతుంది.
ప్రపంచ అరుదైన ఖనిజాల ప్రధాన కేంద్రంగా ఆఫ్రికా ఎదిగింది. కాంగోలో కోబాల్ట్, జింబాబ్వేలో లిథియం, నమీబియాలో యురేనియం, దక్షిణాఫ్రికాలో కీలక లోహ సంపద– ఇవన్నీ ఇప్పుడు కొత్త భౌగోళిక రాజకీయ పోటీకి కేంద్రంగా మారాయి. చైనా ఇప్పటికే ఈ పోటీలో చాలా ముందుంది. ఇదే సమయంలో యూరప్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. ముడి పదార్థాల కొనుగోలుతో ఆగకుండా, స్థానిక ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తి వ్యవస్థల వైపు అడుగులు వేస్తోంది. సరఫరా భద్రతను ఇప్పుడు జాతీయ భద్రతలో భాగంగా చూస్తోంది.
సమగ్ర ప్రణాళిక అవసరం!
భారత్ కూడా ప్రయత్నాలు చేయడం లేదని చెప్పలేం. విదేశీ ఖనిజ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, లిథియం బ్లాక్ల అన్వేషణ, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వంటి చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ ఇవి ఇప్పటికీ ఒక సమగ్ర జాతీయ వ్యూహంగా మారలేదు. ముఖ్యంగా మైనింగ్ తరువాత జరిగే శుద్ధీకరణ, ప్రాసెసింగ్, అధు నాతన మెటీరియల్ తయారీ రంగాల్లో మన సామర్థ్యం పరిమితంగానే ఉంది. అందుకే చైనా చర్యలు భారత్కు ఒక హెచ్చరిక, ఒక అవకాశం కూడా.
చదవండి: చైనాలో అలా.. ఇక్కడ ఇలా!
భారత్ ఇప్పుడు మూడు విషయాలను అత్యవసరంగా చేయాలి – ఖనిజ భద్రతను జాతీయ భద్రతలో భాగంగా చూడాలి; విదేశీ భాగస్వామ్యాలను ముడి పదార్థాల నుంచి ప్రాసెసింగ్ వరకు విస్తరించాలి; దేశీయ పరిశోధన–ఆవిష్కరణ వ్యవస్థపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలి.
ఎందుకంటే భవిష్యత్తులో పోటీ కేవలం ఉత్పత్తుల మధ్య ఉండదు. ఎవరి చేతిలో ముడి పదార్థాలు ఉంటాయి? ఎవరు వాటిని శుద్ధి చేస్తారు? ఎవరు సాంకే తికతను నియంత్రిస్తారు? – ఈ ప్రశ్నలే రేపటి ప్రపంచ శక్తిని నిర్ణయిస్తాయి. భారత్ ఇప్పటికైనా మేల్కొనాలి. లేకపోతే అభివృద్ధి లక్ష్యాలు కొనసాగినా, వాటి పునాది ఇతర దేశాల చేతుల్లో ఉండే ప్రమాదం ఉంది.

- సి.హెచ్.వి. ప్రభాకర్ రావు
సీనియర్ జర్నలిస్ట్


