జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం పురస్కరించుకుని భారత్ సాధించిన విజయాలతో పాటు మన ముందున్న ఒక పెద్ద సవాలును కూడా గుర్తుంచుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పాల కొరతతో ఇబ్బంది పడిన మన దేశం.. శ్వేత విప్లవం (వైట్ రెవల్యూషన్) సాధించిన అద్భుత విజయంతో ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసి, వినియోగించే దేశంగా ఎదిగింది. అయితే ఇప్పుడు పాలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఆ డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోతే.. రాబోయే రోజుల్లో దేశ అవసరాలకు పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే మనం పశువుల సంఖ్యను పెంచడం కాదు, ప్రస్తుతం మన దగ్గర ఉన్న పశువుల నుండి పాల ఉత్పాదకతను (దిగుబడిని) పెంచడమే ఏకైక మార్గం. భారత్లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పశువులు ఉన్నాయి. కానీ ఒక్కో పశువు ఇచ్చే పాల దిగుబడి మాత్రం ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో పశువు నుండి సగటున రోజుకు 7.18 కిలోల పాలు లభిస్తుంటే, మన దేశంలో అది కేవలం 4.87 కిలోలుగా మాత్రమే ఉంది. ఈ పాల దిగుబడిని పెంచడానికి 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి.
ఒకటి పశువులు పాలు ఇచ్చే దశలు, వాటి జాతి లక్షణాలు మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో మేత అందించడం (సైంటిఫిక్ ఫీడింగ్ ప్రాక్టీసెస్) చాలా అవసరం. ఇలా చేయడం వల్ల పాల దిగుబడి పెరగడమే కాకుండా పశువుల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి,
రెండో మార్గం భారతదేశంలోని మొత్తం పశువులలో 73.5 శాతం ఇప్పటికీ మన దేశవాళీ రకాలే ఉన్నాయి. అయితే ఈ పశువుల జాతుల శాతాన్ని మార్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2012, 2019 సంవత్సరాల మధ్య కాలంలో విదేశీ, సంకరజాతి పశువుల సంఖ్య 25 శాతానికి పైగా పెరిగింది. దేశంలోని 56 మిలియన్ల రైతులకు చెందిన 92 మిలియన్ల పశువులకు లబ్ధి చేకూరుస్తున్న 'రాష్ట్రీయ గోకుల్ మిషన్' ఇప్పటివరకు 12.2 కోట్ల కృత్రిమ గర్భధారణలు చేసిన 'నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్' వంటి ప్రభుత్వ పథకాలు ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి.
మూడోది, పశువుల ఆరోగ్య నియమాలను పాటించడం, పాలు పితికేటప్పుడు పరిశుభ్రతను పాటించడం, గాలి వెలుతురు బాగా వచ్చేలా పాకలను నిర్మించడం. డిజిటల్ సేవల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇవి పశువుల అసలు సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో పాల దిగుబడిని సాధించడంలో ఎంతగానో తోడ్పడతాయి.
300 మిలియన్ టన్నుల మార్కును దాటడం
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశం సాధించిన డైరీ రంగాభివృద్ధిని ఒక గొప్ప విజయగాథగా అభివర్ణించవచ్చు. ప్రభుత్వ విధానాల మద్దతుతో జాతీయ సంకల్పం ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ విజయాన్ని మనం గతంలో ఒకసారి సాధించి చూపించాం. ఇప్పుడు మరోసారి సాధించలేకపోవడానికి ఎలాంటి కారణం లేదు. ఈసారి మన దేశ పాల ఉత్పత్తిని 300 మిలియన్ టన్నుల సరిహద్దు దాటించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం.
క్యాప్టెన్ (డాక్టర్) ఎ.వై. రాజేంద్ర, సీఈఓ – యానిమల్ న్యూట్రిషన్ బిజినెస్, గోద్రెజ్ ఆగ్రోవెట్
(చదవండి: వరల్డ్లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్)


