మండే ఎండలు, ఎడారి అంటే వెంటనే గుర్తొచ్చేది రాజస్థాన్. ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వేడిలో కూడా మనసుకి శాంతి, ఆధ్యాత్మిక చల్లదనం కలిగించే ప్రదేశం ఉంది. అదే పుష్కర్లో ఉన్న పవిత్రమైన పుష్కర్ సరోవర్.
ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ సరోవరం రాజస్థాన్లో అత్యంత పవిత్రమైన జల ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సరోవరం బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో ఏర్పడింది అని చెబుతారు. అందుకే ఈ సరోవరం చుట్టూ 50కి పైగా ఘాట్లు, అనేక ఆలయాలు కనిపిస్తాయి.
ఎండాకాలంలో పుష్కర్ పట్టణంలో వేడి ఎక్కువగా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్, సాయంత్రం సమయంలో సరోవరం వద్ద వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో సరోవరం మీద పడిన సూర్య కిరణాల వల్ల నీరు బంగారు వర్ణంలో మెరుస్తుంది. అదే సమయంలో ఘాట్ల దగ్గర భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తూ కనిపిస్తారు. తెల్లని ఘాట్లు, ఆలయాల గోపురాల ప్రతిబింబం నీటిపై పడుతూ ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పుష్కర్కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది.
ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ ఆలయం పుష్కరం ఇక్కడే ఉంది. అందుకే భక్తులు మాత్రమే కాదు, ట్రావెల్ లవర్స్కు కూడా పుష్కర్ ఒక స్పిరిచ్యువల్ డెస్టినేషన్ గా నిలుస్తుంది. ఎండాకాలంలో రాజస్థాన్ పర్యటన అనేది సాధారణంగా కష్టమైనదే. ఒక వేళ ఏదైనా పనిలో భాగంగా వెళ్తే మాత్రం మౌంట్ అబూ, పుష్కర్ వంటి ప్రదేశాలకు పర్యటనకు వెళ్లచ్చు. మండే వేడిలోనూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.
ఎలా చేరుకోవాలి?
తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్ట్ నుంచి జైపూర్ కు నేరుగా ఫ్లైట్లో చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లేవారు.. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ స్టేషన్ నుంచి జైపూర్కు రైలు మార్గాన చేరుకోవచ్చు. హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుంచి రైలు మార్గం అందుబాటులో ఉంది. జైపూర్ నుంచి రోడ్డు మార్గాన అజ్మేర్, పుష్కర్ సులభంగా చేరుకోవచ్చు. వెళ్లడానికి ముందే టికెట్లు, రూమ్లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.
యూరప్లోని అందమైన ద్వీపాల కథ
నార్త్ ఆట్లాంటిక్ సముద్రం మధ్య ఉన్న ఫరో ఐలాండ్స్ అనే ద్వీప సమూహం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. యూరోప్లో ఇది చాలా పాప్యులర్ డెస్టినేషన్. పచ్చని పర్వతాలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న గ్రామాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీ΄ాలకు ప్రత్యేకమైన, ప్రశాంతమైన గ్రామాలే ప్రధాన ఆకర్షణ. ఉదయం వేళలో సముద్ర అలలు, పచ్చని పర్వతాల మధ్య పడిన వెలుగు ప్రపంచం అంతా ప్రశాంతంగా అనిపించే దృశ్యాన్ని సృష్టిస్తుంది.
గ్రామాల జీవనం
ఫరో గ్రామాల సందుల్లో చిన్న ఇళ్లు, గ్రాస్ రూఫ్స్, సముద్రంపై నడిచే పడవల దృశ్యం కనిపిస్తుంది. స్థానిక ప్రజలు ప్రకృతి రిథమ్తో కలిసి జీవించే జీవన విధానాన్ని ఇక్కడ చూడచ్చు. ఫిషింగ్, సముద్ర సంస్కృతి ఇక్కడి ప్రజల జీవితంలో కీలక భాగంలాంటిది. ఇక్కడ ఎక్కువగా వైకింగ్స్ వారసులే నివసిస్తుంటారు.
హైదరాబాద్ నుంచి యాత్ర
హైదరాబాద్ నుంచి ఫరో ఐలాండ్కి ప్రయాణం సాధారణంగా వాయు మార్గంలోనే జరుగుతుంది. ముందుగా హైదరాబాద్ నుండి దుబాయ్ లేదా ఢిల్లీ నుండి యూరోప్లోని కోపెన్ హ్యాగెన్ చేరుకోవాలి. అక్కడి నుండి వగార్ విమనాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి చిన్న రోడ్డు ప్రయాణం చేసి ద్వీపాల మధ్య ఉన్న అందమైన గ్రామాలకు వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.


