మహిళా సాధికారతకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక | TG GOVT To Celebrate Womens Week Celebration From May 25th To 31 | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

May 21 2026 3:01 PM | Updated on May 21 2026 3:06 PM

TG GOVT To Celebrate Womens Week Celebration From May 25th To 31

మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులు తో స‌హా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు.

ప్రత్యేకంగా మే 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్త‌ల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది.

మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీత‌క్క ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. 

మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

కాగా, ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను కీలక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ వారోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. 

(చదవండి: కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్‌​..! ఏకంగా 300 గంటలు..)

Advertisement
 
Advertisement
Advertisement