
ప్రేమానురాగాలకు దూరమవుతున్న పిల్లలు
తల్లిదండ్రుల నుంచి అందని అనురాగం
ఒంటరితనంతో నిత్యం మానసిక సంఘర్షణ
జిల్లాలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమ పిల్లలను విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప వంటి నగరాల్లోని కార్పొరేట్, రెసిడెన్షియల్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అక్కడ హాస్టళ్లలో ఉండలేక చాలా మంది ఇంటి బాటపడుతున్నారు. మరి కొందరు తల్లిదండ్రులు బలవంతంగా అక్కడే ఉండమని నచ్చచెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఒంటరితనంతో నిత్యం మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎదురవుతున్నాయి.
‘అమ్మా, నాన్న నేను ఇంటిలో ఉండి చదువుకుంటాను. ఇంట్లో వాళ్లను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. చదువు పేరుతో నన్ను ఇంటి నుంచి దూరం చేయాలని చూడవద్దు. నాకు మీ ప్రేమానురాగాలు కావాలి. బాగా చదువుకుని టీచరై పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతాను’ ఓ కుమార్తె అభ్యర్థన.
నువ్వు హాస్టల్లో ఉండి చదవాల్సిందే. మంచి మార్కులు, ర్యాంకులు సాధించి డాక్టర్ కావాలి. తల్లిదండ్రుల సమాధానం. ఇదీ నేడు కొందరు తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరు. పిల్లల ఆలోచన, వారి అభిరుచులకు భిన్నంగా స్పందిస్తున్న విధానం. దీంతో పిల్లలు ఒంటరిగా హాస్టళ్లలో ఉండలేకపోతున్నారు. కొందరు ఆత్మన్యూనతా భావంతో పెరిగి పెద్దవారై ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు.
మదనపల్లె సిటీ: బాల్యం పిల్లలకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య ఆడుతూ పాడుతూ, చిరునవ్వులు చిందిస్తూ బాల్యాన్ని ఆస్వాదించాలి. అప్పుడే బాల్యానికి సాకారం. ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం కుటుంబం నుంచి రావాలి. నేటి పోటీ ప్రపంచం, ప్రపంచీకరణ నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు పిల్లల బాల్యాన్ని హరిస్తూ యాంత్రిక జీవనానికి అలవాటు చేస్తున్నారు. బాల్యంలోని మధురానుభూతులకు దూరం చేస్తున్నారు. పిల్లలను మార్కులు, ర్యాంకులను తయారు చేసే యంత్రాలుగా చేస్తున్నారు. దీని కోసం వారి ఇంటి నుంచి దూరంగా కార్పొరేట్ పాఠశాలల్లో బలవంతంగా చేర్పిస్తున్నారు. పాఠశాల స్నేహితుల సాన్నిహిత్యం ఉన్నా అమ్మ పంచే ప్రేమకు ఏదీ సాటిరాదు. నాన్న చూపే ఆదరణ ఏవీ సరితూగవు. దీంతో పిల్లలు తమలో తాము సంఘర్షణ పడుతూ జీవితాన్ని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ మార్కులు, ర్యాంకులే కాకుండా వారి కోసం కాస్త సమయాన్ని కూడా కేటాయించి ప్రేమను పంచాలని పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని మనోవ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా అంటున్నారు. లేనిపక్షంలో పిల్లల్లో భావవ్యక్తీకరణ నైపుణ్యం తగ్గడంతో పాటు అభద్రతా భావం పెరుగుతుందని చెబుతున్నారు. కౌమార దశలోని పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమానురాగాలు లభించకపోతే వారిలో మానసిక రుగ్మతలు చోటు చేసుకుంటాయని వెల్లడిస్తున్నారు. ఆయా వయస్సులో వచ్చే శారీరక, మానసిక మార్పులను సరిచేయక, సరైన మార్గదర్శనం చేయకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని సూచిస్తున్నారు. కొందరు పిల్లలు తప్పటడుగులు వేసే ప్రమాదం కూడా లేకపోలేనది హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే ఏ చిన్న సమస్య ఎదురైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
కనుమరుగవుతున్నఉమ్మడి కుటుంబ వ్యవస్థ
గతంలో అవ్వా,తాతలు, అమ్మానాన్నలు, చిన్నాన్న, పెద్దనాన్న, వారి పిల్లలతో కూడిన ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న మార్పులతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. నేటి కొందరు తల్లిదండ్రుల ఆలోచనా విధానంతో కనీసం కన్న బిడ్డలతో కూడిన సమిష్టి కుటుంబ వ్యవస్థ కూడా మాయమైపోతోంది. పిల్లలను వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి ఒంటరి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సమాజంలో అనుబంధం, ప్రేమ, వాత్సల్యం అనే పదాలకు అర్థాలు కూడా మరచిపోతున్నారు.
ఇదీ చదవండి: డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్
తల్లిదండ్రుల ధోరణి మారాలి
ఆధునిక జీవన విధానంలో అమ్మానాన్నల ఆలోచనా ధోరణి మారాలి. శారీరక, మానసిక పెరుగుదల వేగంగా జరిగే కౌ మార దశలో పిల్లలకు కుటుంబంలోని ప్రత్యక్షానుభవాలు ఎంతో అవసరం. ఈ దశలో పిల్లలు ఎదుర్కొనే సంఘర్షణలను అమ్మానాన్నలు మాత్రమే అర్థం చేసుకోగలరు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి.. ప్రేమానురాగాలు పంచాలి. –ఎస్.రెడ్డప్పరెడ్డి, అధ్యాపకులు, బాలికల జూనియర్ కాలేజీ, మదనపల్లె
చదవండి: మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!
తల్లిదండ్రుల అనురాగం అవసరం
బాల్యంలో చిన్నపిల్లలకు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు చాలా అవసరం. తల్లిదండ్రు లు ఎంత ఉద్యోగులైనా పిల్లల కోసం రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండేలా చూడాలి. చదువంటే మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదనే విషయాన్ని గ్రహించాలి. పిల్లల అభిరుచి మేరకు వారిని ఎదగనివ్వాలి. వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి. - టీఎఎస్ఏ క్రిష్ణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, మదనపల్లె
మానసిక ఒత్తిడితో అనర్థాలు..
చిన్నప్పటి నుంచే పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైతే మానసిక ఒత్తిడి పెరిగి అనేక అనర్థాలకు దారి తీస్తాయి. ఆస్పత్రులకు వైద్య పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల్లో అనేక మంది మానసిక ఒత్తిడితో పాటు మనోవేదనకు గురైన వారే ఉంటున్నారు. ఇంటికి, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందున ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పోషక విలువలు కలిగిన ఆహారం అందకపోవడంతో వ్యాధులకు గురవుతున్నారు.– చాముండేశ్వరి, సైకాలజిస్టు, మదనపల్లె