యుద్ధం ఆగడం లేదు. మన ఇంటి గ్యాస్ కష్టాలు, ఆందోళనలు ఆగడం లేదు. ఈ సంక్షోభ కాలంలో సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజా విషయానికి వస్తే... పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్ ఈథర్ (డీఎంయీ) ని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. కార్బన్ డయాక్సైడ్ను వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్గా మార్చే సాంకేతికతను బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు...
పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డీఎంయీని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది దేశం ఎల్పీజీ దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు మన దేశ ఇంధన స్వయం సమృద్ధికి ఉపకరిస్తుంది. అంతేకాదు, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్ప్రేరకాన్ని (కెటలిస్ట్) ఉపయోగించి మిథనాల్ను డైమిథైల్ ఈథర్గా మారుస్తుంది. పరిశోధన బృందానికి తిరుమలైస్వామి రాజా నాయకత్వం వహించారు.
స్వచ్ఛమైన ఇంధనం
సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే... డైమిథైల్ ఈథర్(డిఎంఈ) చాలా తక్కువ పరిమాణంలో మసి, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, కణ పదార్థాలను విడుదల చేస్తుంది. అందుకే దీనిని స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణిస్తారు. దీంతో పాటు ఇది ఎల్పీజీకి సమానమైన వేడిమిని అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వినియోగానికి సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్’ ఇప్పటికే నియమాలను నిర్దేశించింది.
గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఎల్పీజీలో 20 శాతం వరకు డిఎంఈని కలపవచ్చు. ఎల్పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఎల్పీజీలో 8 శాతం వరకు డిఎంఈ కలపవచ్చు. వంటగది ఏర్పాట్లు మార్చకుండానే ఈ మిశ్రమ ఇంథనాన్ని ఉపయోగించవచ్చు.
ఈ ఇంధనంతో ఎంతో ఆదా!
మన దేశం 2024లో దాదాపు 21 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. కేవలం 8 శాతాన్ని డిఎంఈతో భర్తీ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ’9,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. వంట ఇంధనం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకే కాకుండా ఏరోసోల్ ఉత్పత్తులలో ప్రోపెల్లెంట్గా పనిచేస్తోంది డిఎంఈ. తమ సాంకేతికతను రోజువారీ వినియోగానికి మరింత చేరువ చేయడానికి సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు పేటెంట్ పొందిన ఒక బర్నర్ నమూనాని కూడా రూపొందించారు.
ఈ బర్నర్ 100 శాతం ఎల్పీజీ నుండి 100 శాతం డిఎంఈ వరకు, అలాగే ఈ రెండింటి మధ్య ఏ మిశ్రమంతోనైనా ఫ్లెక్సిబుల్ మోడ్లో పనిచేయగలదు. దీనికి సంబంధించి బెంగళూరులోని ఎల్పీజీ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పరిశోధనల ద్వారా రోజుకు 2.5 టన్నుల డిఎంఈ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఒక ప్లాంట్ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలల్లో దీని ఏర్పాటుకు శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
బలమైన ముందడుగు
పర్యావరణ సంరక్షణ, ఇంధన భద్రత మధ్య అంతరాన్ని పూరిస్తూ, స్వావలంబన, స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాల దిశగా వేసిన బలమైన ముందడుగుగా ఈ ఆవిష్కరణ నిలవనుంది.‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ నిధులతో కొన్ని సంవత్సరాల క్రితం మేము మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. కార్బన్డయాక్సైడ్ అనేది గ్రీన్హౌస్ వాయువు. దీనిని నియంత్రించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి... కార్బన్ కాప్చర్ అండ్ స్టోరేజ్. మేము మరో అడుగు ముందుకు వేసాం. దీనిద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్హౌస్ వాయువులను గణనీయంగా తగ్గించవచ్చు. అలా చేస్తూనే శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు’ అంటున్నారు ప్రోఫెసర్ సౌనక్ రాయ్.
సీవో2 టు గ్యాస్!
కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను స్వచ్ఛంగా మండే వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్గా మార్చే విప్లవాత్మక సాంకేతికతను హైదరాబాద్లోని బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రోఫెసర్ సౌనక్ రాయ్, ప్రోఫెసర్ సత్యపాల్ సింగ్, ప్రోఫెసర్ బి.ఎం.రెడ్డి ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.
‘మేము ఇప్పటివరకు చేసింది ఒక ప్రయోగశాల–స్థాయి ప్రదర్శన మాత్రమే. తగిన సహాయ సహకారాలతో మేము దీనిని పైలట్ స్థాయికి తీసుకువెళ్లి ఆపై వాణిజ్యీకరణ వైపు వెళ్లగలం. ఇందుకు కొంత సమయం పడుతుంది. మేము ఇప్పటికే ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేశాం. మా రీసెర్చ్ గురించి ఒక సైంటిఫిక్ జర్నల్కు తెలియజేశాం’ అని ప్రోఫెసర్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పా రు.


