
భువనేశ్వర్/పూరీ: పవిత్రమైన తులసి మాలలతో బుల్లి రథం రూపుదిద్దుకుంది. స్వామివారి భక్తులకు ఈ కళాఖండం అంకితం చేసినట్లు సృజనాత్మక కళాకారుడు బిశ్వజిత్ నాయక్ తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి 8 అంగుళాల ఎత్తు, 7 అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ రథంలో 551 తులసి మాలలు, 175 ఐస్క్రీం పుడకల్ని వినియోగించారు.
రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం
రథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది.

బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు.