సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం | Jagannath Rath Yatra 2025 Amruthanna seva For lord Jagannath | Sakshi
Sakshi News home page

Jagannath Rath Yatra 2025: సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం

Jun 24 2025 11:25 AM | Updated on Jun 24 2025 2:12 PM

Jagannath Rath Yatra 2025 Amruthanna seva For  lord Jagannath

భువనేశ్వర్‌: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్‌ అరవింద కుమార్‌ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్‌ మహాసువార్‌ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 

సువార్‌ మహాసువార్‌ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్‌ ప్రగతి ఇనిస్టిట్యూట్‌ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 

సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. 
మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్‌ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన  ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. 

తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్‌ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని  ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. 

పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్‌ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.

ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement