కొట్టలేకపోయిన వారిని కొట్టించాడు! | Crime Story Of Funday | Sakshi
Sakshi News home page

కొట్టలేకపోయిన వారిని కొట్టించాడు!

Jun 29 2025 8:41 AM | Updated on Jun 29 2025 8:41 AM

Crime Story Of Funday

∙పార్ట్‌–2  - కేరళలో ఇటీవల ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక స్కూల్‌ పూర్వ విద్యార్థులు కొందరు గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ బాలకృష్ణన్, అతడి స్నేహితుడు మాథ్యూ కలిసి బాబుపై (62) దాడి చేశారు. అదేమంటే, 50 ఏళ్ల క్రితం నాలుగో తరగతిలో ఉండగా బాబు తనను కొట్టాడని, బలహీనంగా ఉన్న తాను అప్పుడు కొట్టలేకపోయానని, ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నానని చెప్పాడు. ఉస్మాన్‌ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనీస్‌ను భరూచ్‌లో పట్టుకున్న పోలీసులకు ఇదే అనుభవం ఎదురైంది. డిగ్రీ వరకు చదువుకున్న అనీస్‌ తెలివైనవాడే అయినా, అతడికి శరీర దారుఢ్యం లేదు. దీంతో స్కూలు, కాలేజీ రోజుల్లో కొందరు స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ చేతిలో దెబ్బలు తిన్నాడు. మిగతా వారిని మర్చిపోయిన అనీస్, తనను విచక్షణారహితంగా కొట్టిన ఇద్దరు క్లాస్‌మేట్స్‌ను మాత్రం గుర్తుంచుకున్నాడు. 

తన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో మంచినీళ్ల విషయమై అనీస్‌కు గొడవ జరిగింది. దీంతో అతడు దాడి చేసినా, ఇతడు ప్రతిదాడి చేయలేకపోయాడు. ఈ విషయంతో అతడిపైనా కక్ష పెంచుకున్న అనీస్‌ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అనీస్‌ను భరూచ్‌ నుంచి హైదరాబాద్‌ తీసుకువచ్చిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సహ నిందితులు, బాలుడి ఆచూకీ కోసం ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో పాటు పక్కింటి యజమానిపై కక్ష తీర్చుకోవాలని భావించిన అనీస్‌– వారి పేర్లు, వివరాలు చెప్పి, వాళ్లతో కలిసే నేరం చేశానని, బాలుడు వారి వద్దే ఉన్నాడని చెప్పాడు.

అనీస్‌ పథకం విషయం తెలియని పోలీసులు బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో వారిని తీసుకువచ్చి ప్రశ్నించడం, వాళ్లు తమకు ఏమీ తెలియదని చెప్పడంతో ‘ఇంటరాగేషన్‌’ మొదలుపెట్టారు. వీరిలో ఓ ఏఎస్సై కుమారుడు సైతం ఉండటంతో ఆ అధికారి కూడా వచ్చి ‘ఇంటరాగేషన్‌’లో పాల్గొన్నారు. ఇలా నలుగురిని తీసుకువచ్చి, ‘ఇంటరాగేషన్‌’ చేసి, వారి పూర్వాపరాలు పరిశీలించాక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అనుమానం వచ్చింది. అనీస్‌ తప్పుదోవ పట్టిస్తున్నాడని భావించారు. అప్పటి వరకు అతడిని ‘ఇంటరాగేషన్‌’ చేయని అధికారులు ఆపై తమ పంథాలో ముందుకు వెళ్లారు. దీంతో అసలు విషయం చెప్పిన అనీస్, ‘వాళ్లు అందరూ ఒకప్పుడు నన్ను కొట్టారు. అప్పుడు నేను తిరిగి కొట్టలేకపోయాను. ఇప్పుడు  అవకాశం రావడంతో మీతో కొట్టించాను’ అని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. 

ఈ పరిణామంతో పోలీసుల ట్రీట్‌మెంట్‌ కూడా మారిపోవడంతో నోరు విప్పిన అనీస్‌... కిడ్నాప్‌ చేసిన గంటలోపే అనుకోని పరిస్థితుల్లో ఉస్మాన్‌ తమ చేతిలో హత్యకు గురయ్యాడని బయటపెట్టాడు. కిడ్నాప్‌ చేసిన 2009 ఏప్రిల్‌ 20నే బాలుడిని తీసుకుని నిందితులు మారుతీ వ్యాన్‌లో శంషాబాద్‌ వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో పోలీసుల నాకాబందీ నిర్వహిస్తున్నారు. దీంతో తాము వారి కంట పడకూడదని అనీస్‌ తదితరులు భావించారు. 

అప్పటికే ఉస్మాన్‌ గొడవ చేస్తుండటంతో చెకింగ్‌ పాయింట్‌ దాటే వరకు నోరు మూసి, వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించారు. ఆ ప్రయత్నాలో భాగంగా వీళ్లు పొరపాటున ఉస్మాన్‌ ముక్కు కూడా మూసేయడంతో చనిపోయాడు. చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత బాలుడిని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ సమీపం వరకు తీసుకువెళ్లి, రోడ్డు పక్కన గుంతలో పడేసి, పైన చెత్తకప్పి ఎవరికి వారుగా పారిపోయారు. బాలుడు చనిపోయిన విషయం అతడి కుటుంబానికి తెలియదు కాబట్టి తమ వద్దే ఉన్నాడని చెబుతూ డబ్బు గుంజాలనే ఉద్దేశంతో ఫోన్లు చేశాడు. 

ఉస్మాన్‌ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 2009 ఏప్రిల్‌ 20 తర్వాత రాష్ట్రంలోను, చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ దొరికిన గుర్తుతెలియని శవాల వివరాలను ఆరా తీశారు. వాటిలో 10–15 ఏళ్ల మధ్య వయస్సు వారివి లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు సాగలేదు. ఉబ్బిపోయిన స్థితిలో ఉన్న ఉస్మాన్‌ మృతదేహాన్ని 2009 ఏప్రిల్‌ 23న గుర్తించిన పశువుల కాపరులు షాద్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదేదో సాధారణ కేసుగా భావించిన ఆ ఠాణా అధికారులు ఓ హెడ్‌–కానిస్టేబుల్‌ను ఘటనాస్థలికి పంపారు.

 అక్కడకు వెళ్లిన ఆ అధికారి మృతదేహం ఉబ్బి ఉండటంతో అది 25–30 ఏళ్ల మధ్య వయస్కుడిగా భావించి అలానే రికార్డుల్లో నమోదు చేయడంతో ఆ విషయం టాస్క్‌ఫోర్స్‌ దృష్టికి రాలేదు. ఉస్మాన్‌కు సంబంధించి తొలుత శాలిబండ పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అనీస్‌ నుంచి ఫోన్లు వచ్చిన తర్వాత ఇది కిడ్నాప్‌గా మారింది. షాద్‌నగర్‌లో మృతదేహం దొరికిన వెంటనే అక్కడ పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఈ మృతదేహానికి షాద్‌నగర్‌ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా, ఎందరో చంపినట్లు బయటపడంతో గుర్తుతెలియని హత్యగా కేసును మార్చారు. ఇలా రెండు పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా నమోదైన ఉస్మాన్‌ కేసు నాలుగు రకాలుగా మారింది. 

షాద్‌నగర్‌ పోలీసులు ఉస్మాన్‌ మృతదేహంపై లభించిన చొక్కాను భద్రపరచారు. దీని ఆధారంగానే కుటుంబీకులు అది తమ కుమారుడి మృతదేహమే అని గుర్తించగలిగారు. ఈ కేసు దర్యాప్తు మొత్తం పూర్తి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2009 జూన్‌ 9న అనీస్‌తో పాటు అతడి సోదరులు షంషుద్దీన్‌ అలియాస్‌ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్‌ అలియాస్‌ అస్లంలను అరెస్టు చేశారు. ఈ నేరం చేసిన తర్వాత అత్యంత తెలివిగా వ్యవహరించిన అనీస్‌ బాలుడి కుటుంబంతో కలిసే ఉన్నాడు. ఓ దశలో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్‌ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో కిడ్నాప్‌ డ్రామా ఆడి కామాటిపురాలో కేసు నమోదు చేయించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 


∙ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement