రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?! | 7 Hours Per Day we are Consuming Online Media | Sakshi
Sakshi News home page

రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!

Apr 12 2025 10:36 AM | Updated on Apr 12 2025 11:14 AM

7 Hours Per Day we are Consuming Online Media

నగర జీవితంలో భాగంగా మారిన గ్యాడ్జెట్లు 

ఊహించని సౌలభ్యాలను అందిస్తూనే, ఆరోగ్యానికి చేటు 

రోజులో 7 గంటలు డిజిటల్‌ గ్యాడ్జెట్లకే వినియోగం 

దాదాపు రెండు గంటలకు పైనే సోషల్‌మీడియా 

పలు అధ్యయనాలు  వెల్లడిస్తున్న అంశాలు
 

ఆధునిక సాంకేతికత కారణంగా నగర జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర నిత్య క్రియలతో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ టెక్నికల్‌ లైఫ్‌గా మారిపోయింది. ప్రధానంగా నగరవాసులు తమ జీవితంలో గ్యాడ్జెట్‌లను ఒక భాగంగా మార్చుకున్నారని.. ఉదయాన్నే నిద్ర లేపే అలారమ్‌ మొదలు రాత్రి నిద్రించే ముందు గంటల తరబడి మొబైల్‌ స్క్రీన్‌ చూడటం వరకూ ప్రతి క్షణం గ్యాడ్జెట్ల మధ్యనే గడుస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి మనిషి ఆరోగ్యం, ఫిట్నెస్, కమ్యూనికేషన్, విజ్ఞానం, వినోదం మొదలైన అనేక అంశాల్లో ప్రభావం చూపుతున్నాయి.  – సాక్షి, సిటీబ్యూరో 
 

దైనందిన జీవితంలో విచ్చలవిడి వినియోగం విజ్ఞానం, వినియోగమూ ఎక్కువే..! 

గ్యాడ్జెట్స్‌ మన సౌలభ్యం కోసం ఆహ్వానించినవే ఐనప్పటికీ.. వీటి వినియోగంలో మంచి- చెడూ ప్రయోజనా లున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్యాడ్జెట్స్‌పై ఎంత వరకూ ఆధారపడాలి, ఎంత వరకూ వినియోగించుకోవాలి, ఇవి చేస్తున్న మేలేంటి, కలిగిస్తున్న ముప్పు ఎంత అనేది విశ్లేíÙంచుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఈ గ్యాడ్జెట్ల ప్రభావాన్ని నియంత్రించాల్సిన అవసరముందని ఎన్‌సీఈఆర్‌టీ వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. 

స్మార్ట్‌ లైఫ్‌.. బ్యాడ్‌ రిజల్ట్‌.. 
ఆరోగ్య పరంగా ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లు వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యాపిల్‌ వాచ్, ఫిట్‌బిట్, శామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌ వంటి డివైజ్‌లు మన హార్ట్‌ రేట్, నిద్ర, వాకింగ్‌ స్టెప్స్, క్యాలరీ బర్న్‌ వంటి వివరాలు మానిటర్‌ చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ఎంతో దోహదపడుతున్నా. అదే సమయంలో మితిమీరిన స్క్రీన్‌ టైం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కళ్ల సమస్యలు వంటి దుష్పరిణామాలూ ఎదురవుతున్నాయి. 

ఫిట్నెస్‌
ఫిట్నెస్‌ పరంగా షాఓమీ, ఎమ్‌ఐ బ్రాండ్, హానర్‌ బ్యాండ్‌లాంటివి మన వర్కౌట్‌ యాక్టివిటీలను ట్రాక్‌ చేస్తాయి. యూట్యూబ్, ఫిట్‌నెస్‌ యాప్‌ల ద్వారా ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చు. దీని కోసం ఆన్‌లైన్‌ వేదికగా లెక్కకు మించిన వీడియోలు, సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఈ గ్యాడ్జెట్లపై ఆధారపడుతూ నిజమైన ఫిజికల్‌ యాక్టివిటీకి, వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతే ఫలితం కనబడదని కొందరు ఫిట్నెస్‌ ట్రైనర్ల సూచన. 

గ్యాడ్జెట్లతో 7 గంటలు.. 
స్మార్ట్‌ ఫోన్‌ సహాయంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో రోజంతా మునిగిపోయే స్థితికి చేరుకున్నారు. ఇది ఒంటరితనాన్ని, ఆత్మవిమర్శను పెంచే పెను ప్రమాదంగా మారింది. సోషల్‌ యాప్స్‌ సమాజానికీ, మనుషులకూ మధ్య సంధానకర్తగా మారాయి. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో చేరిపోతుండటం సాంకేతికత మాయాజాలమే. సామాజిక అభివృద్ధిలో ఇదొక కీలక మలుపు. కానీ ఈ వేదికగా లభ్యమయ్యే సమాచారంలో వాస్తవికత, నిజాలను తేల్చిచెప్పే అవకాశం అంతగా లేకపోవడంతో మంచి-చెడూ రెండు అంశాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. 2023లో ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎమ్‌ఏఐ), నిల్‌సెన్‌ సంయుక్తంగా నిర్వహించిన రిపోర్ట్‌ ప్రకారం.. భారతదేశంలో సగటు పౌరుడు రోజుకు సుమారు 7 గంటల పాటు డిజిటల్‌ గ్యాడ్జెట్లపై గడుపుతున్నాడు. ఇందులో 2.5 గంటలు సోషల్‌ మీడియా కోసం మాత్రమే వినియోగిస్తున్నాడని వెల్లడించారు. 

డిజిటల్‌ డిపెండెన్సీ.. 
వినోదం, గేమింగ్‌ రంగాల్లో ఈ గ్యాడ్జెట్లు మరో కొత్త యుగానికి నాంది పలికాయి. ఆక్యులస్‌ క్వెస్ట్, ప్లే స్టేషన్, వీఆర్‌ వంటి హెడ్‌సెట్లు వాస్తవిక అనుభూతిని అందిస్తూ, వినోదాన్ని సహజ అనుభూతిని పంచుతున్నాయి. ప్రస్తుత 5డీ టెక్నాలజీ గేమ్స్‌ అద్భుత వినోదంతో.. పాటు సమయాన్ని వృథా చేస్తోంది. భారతీయ పరిశోధన సంస్థ ఎయిమ్స్, ఐసీఎమ్‌ఆర్‌ నిర్వహించిన అధ్యయనంలో సుమారు 3000 మంది అత్యధిక స్క్రీన్‌ టైం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చింది. మరీ ముఖ్యంగా యువతలో డిజిటల్‌ డిపెండెన్సీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించాయి. 

ఆనందం.. ఆధిపత్యం కాకూడదు.. 
మొత్తానికి గ్యాడ్జెట్లు మన జీవితంలో అసాధారణ సౌలభ్యాలను, అనుకూలతలను తీసుచ్చినా, అవి మనిషిపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తగా ఉండాలి. వాటిని సంతులితంగా వాడితే అవి వరంగా మారతాయి. లేకపోతే అవే మన స్వేచ్ఛను హరిస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్స్‌ చేపట్టిన పరిశోధనలో ఎక్కువగా మొబైల్‌ వాడకం వల్ల యువతలో ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం పెరిగినట్లు తేలింది. ఈ అధ్యయనంలో ‘నోమోఫోబియా’ (నో మొబైల్‌ ఫోబియా) అనే పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement