ఏలూరు (ఆర్ఆర్పేట): స్వచ్ఛతా హీ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఇన్చార్జి కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. కలెక్టరేట్లో గురువారం స్వచ్ఛతా హీ సేవ వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. వచ్చేనెల 17 వరకు నెలరోజులపాటు జరిగే కార్యక్రమాల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, పట్టణ, స్థానిక సంస్థలు, మండల స్థాయి అధికారులు, విద్యా సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యార్థులు, సఫాయిమిత్రలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. స్వచ్ఛతను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగంగా మార్చేలా విస్తృత అవగాహన కల్పించాలన్నా రు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహ ణ, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ, ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ భాగం కావాలని కోరారు. డీపీఓ జీవీకే మల్లికార్జునరావు, డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ, డీఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ పి.శారద, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.


