భీమడోలు: రీసర్వే వల్ల భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. పూళ్లలో భూసర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈకేవైసీ ప్రక్రియలను పరిశీలించి సర్వే నిర్వహణ తీరును అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడి రీ సర్వేలో సమస్యలు, సందేహాలు, భూ హద్దుల అంశాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అలాగే భీమడోలులో రెవెన్యూ సర్వే సిబ్బందితో ఆయన సమీక్షించారు. పనుల పురోగతిని తెలుసుకుని, ఈకేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆర్జేడీ సీహెచ్వీఎన్ఎస్ కుమార్, డీఎల్ఎల్ఓ షేక్ ఎండీ అన్సారీ, డీఐవో టీబీఎస్వీ రమణారావు, తహసీల్దార్ బి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


