కాళ్ల: మండలంలోని ఎల్ఎన్ పురం నుంచి ఆనందపురం గ్రామం మీదుగా ఉప్పుటేరులో కలిసే కొబ్బరిచెడు మురుగు కాలువ కిక్కిస, గురప్రుడెక్క, తూడుతో పూర్తిగా పూడుకుపోయి నీరు ముందుకు సాగడం లేదు. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉప్పుటేరులో కలిసే ఈ కాలువను ఆనుకుని సుమారు 1,700 ఎకరాల ఆక్వాసాగు జరుగుతుంది. కాలువ పూర్తిగా పూడుకుపోవడంవల్ల వర్షాకాలం గ్రామాల్లో మురుగునీరు లాగక ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తవ్విన ఈకాలువను ప్రక్షాళన చేయాలని అధికారులు, నాయకులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొబ్బరిచేడు కాలువను ప్రక్షాళన చేసి గ్రామాలను ముంపు బారి నుంచి కాపాడి, తమ ఆక్వాసాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు రైతులు తెలిపారు.


