పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్) బృందం మంగళవారం విస్తృతంగా పర్యటించి నాణ్యతా పరీక్షలు నిర్వహించింది. ఈ బృందంలో నిపుణులు అన్వేష్, గౌరవ్ పాండే, ఉదయ్ చక్రవర్తి, హరీందర్ సింగ్ ప్రకాష్లు ఉన్నారు. గతంలో ప్రాజెక్టు కాంక్రీట్ పనులను పరిశీలించిన ఈ బృందం, తాజాగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వినియోగిస్తున్న రాళ్లు, మట్టి నాణ్యతను పరీక్షించింది. గ్యాప్–1, గ్యాప్–2 ప్రాంతాల్లో జరుగుతున్న పనులతో పాటు అక్కడ వినియోగిస్తున్న ఇసుకను కూడా వారు పరిశీలించారు. ప్రాజెక్టు ఆవరణలో నిల్వ ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి స్థానిక ల్యాబ్లో పరీక్షించిన నిపుణులు, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాప్–1లో ఇప్పటివరకు జరిగిన పనుల్లో వాడిన పదార్థాలకు రింగ్ టెస్ట్ నిర్వహించారు. మరిన్ని లోతైన పరీక్షల కోసం కొంత మట్టిని ఢిల్లీలోని తమ కేంద్ర పరిశోధనాలయానికి తీసుకెళ్లారు.


