ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో నిరంకుశ రాజ్యం నడుస్తోందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సా ర్సీపీ లీగల్ సెల్ ఏలూరు నగర అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్ నెలలో సాక్షి దినపత్రిక కార్యాలయంపై టీడీపీ అరాచక శక్తులు దాడులు చేసి ఫర్నిచర్ను ధ్వసం చేసిన సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు కట్టకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. దీనిపై వైసీపీ లీగల్ సెల్ పక్షాన ఏలూరు మొబైల్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేయగా గౌరవ న్యాయస్థానం ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించిందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హత్యా రాజకీయాలు చేస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వీటన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళుతున్న సాక్షి దినపత్రిక గొంతు నొక్కాలని పత్రికా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


