నూజివీడు: గేట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ట్రిపుల్ఐటీల ప్రతిష్టను మరింత పెంచారని రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో గేట్–2026లో ప్రతిభ కనబర్చిన నేపధ్యంలో మంగళవారం గేట్–2026 సక్సెస్ మీట్ను నిర్వహించారు. గేట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అర్హత సాధించిన ఇతర విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో 100 లోపు ర్యాంకులు సాధించిన హర్షిత్ రెడ్డి (26వ ర్యాంక్), ఆర్. సురేష్ (37వ ర్యాంక్), మనోజ్ కుమార్ (43వ ర్యాంక్), తిలక్ (54వ ర్యాంక్), నాగరాజు (66వ ర్యాంక్), అజయ్ కుమార్ (69వ ర్యాంక్), హర్షిత్ రెడ్డి (70వ ర్యాంక్), శ్రీనివాస్ (95వ ర్యాంక్)లను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నూజివీడు డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ రీజినల్ మేనేజర్ దోసపాటి హర్షవర్ధన్, సెంట్రల్ అకడమిక్ డీన్ దువ్వూరి శ్రావణి, సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్ నాగార్జునదేవి, పరిపాలనాధికారి బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.


