ఆగిరిపల్లి: మండలంలో కనసానపల్లి, నెక్కలం గొల్లగూడెం, అడవినెక్కలం గ్రామాల్లో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పొగాకు కంపెనీకి చెందిన ప్రతినిధులు గ్రామాలకు వచ్చి రైతులకు క్వింటాకు రూ.16 వేలు ఇస్తామని చెప్పి, నారు కూడా ఇవ్వడంతో ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో వైట్ బర్లి పొగాకును రైతులు అప్పులు చేసి మరీ సాగు చేశారు. ఎకరానికి రూ.1.50 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అయితే కొనుగోలుకు సంబంధించి బాండ్లు కూడా ఇస్తామని చెప్పి రైతులతో సంతకాలు చేయించుకున్నారు. తర్వాత బాండ్లు ఊసే ఎత్తలేదు. తీరా పంట చేతికి వచ్చాక కంపెనీ ప్రతినిధులు ప్లేట్ ఫిరాయించి పొంతన లేని మాటలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు నాణ్యత బాగా లేదని, కంపెనీలో సరిపడా నిలువలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కంపెనీలు ఎప్పుడు కొంటాయో? తెలియక రైతులు పొలాల్లో, ఖాళీ స్థలాల్లో మండేలు వేసి కాపలా కాస్తున్నారు. కొంతమంది రైతులు కోత కోయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఉసురుమంటూ పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటికై నా కంపెనీలు కొనుగోలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
దయనీయంగా నాలుగు గ్రామాల
రైతుల పరిస్థితి


