కామవరపుకోట: పెట్రోల్, డీజిల్ కొరత తీర్చటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, అమరావతి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కొరత వల్ల వాహనదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. డీజిల్ కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. దీంతో నిత్యావసర సరుకులకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రబీ సీజన్ కావడం వల్ల పంట కోత మెషీన్లకు, ట్రాక్టర్ల వాడటానికి డీజిల్ లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వెంటనే ఇంధన సరఫరా సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ, నానాది సాగర్, భీమిరెడ్డి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.


