యలమంచిలి: కొంతేరు గ్రామంలోని యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో మే 1, 2, 3 తేదీల్లో 44వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు (నాయుడు) తెలిపారు. నాటిక పోటీల సావనీర్ సోమవారం యూత్ క్లబ్ నాటక పరిషత్ పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరం వేదికపై జరిగే ఈ పోటీల్లో మొదటి రోజు ప్రముఖ టీవీ, సినీ నటుడు నిర్మాత ఖండవల్లి అనిల్ ఆర్కాను సన్మానిస్తామన్నారు. మొదటి రోజు మొదటి ప్రదర్శనగా కాకినాడ బీవీకే క్రియేషన్స్ వారిచే తితిక్ష, రెండవ ప్రదర్శనగా గుంటూరు శ్రీ కరణం సురేష్ మెమోరియల్ థియేటర్ వారిచే తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రదర్శిస్తారు. రెండవ రోజు మొదటి నాటికగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారిచే అమ్మ చెక్కిన బొమ్మ రెండవ ప్రదర్శనగా విజయవాడ హర్ష క్రియేషన్స్ వారిచే భువికోరని భ్రమణం, మూడవ ప్రదర్శనగా యడ్లపాడు మానవత వారిచే అందరూ మంచివారే..కానీ నాటికలు ఉంటాయి. మూడవ రోజు మొదటి ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారిచే ఇది అతని సంతకం, రెండవ ప్రదర్శనగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి వారిచే అగ్ని సాక్షి నాటికలు ప్రదర్శిస్తారు.
ఏలూరు టౌన్: పోలీస్ సిబ్బంది సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. చాట్రాయి పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన వీ.మాధవరెడ్డి సతీమణి సుజాతకు సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శివకిషోర్ చేతులమీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫ్లాగ్ ఫండ్ రూ.25 వేలు, విడో ఫండ్ రూ.50 వేల చెక్కును ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరెడ్డి సేవలు ఎనలేనివనీ, ఆయన మరణం పోలీస్ శాఖకు తీరని లోటన్నారు. కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం చేపట్టేందుకు సిఫార్సు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయ బీ సెక్షన్ సూపరింటెండెంట్ పీ.నాగేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.


