కుక్కునూరు: ఉపాధి హామీ పథకంలో వర్క్ ఆర్డర్ ఇచ్చిన చోట మస్తర్ వేయించుకొని.. పని మరో ప్రదేశంలో చేయించడం స్థానికంగా విమర్శలకు దారి తీసింది. మండలంలోని దాచారం పంచాయతీ, నెమలిపేట గ్రామ సమీపంలో ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా చెరువు పూడికతీత పనిని స్థానిక రైతు వర్సా నాగేశ్వరరావు పేరుమీద వర్క్ ఆర్డర్ను మంజూరు చేశారు. గత రెండు వారాలుగా చెరువు పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. కాని రెండు రోజులుగా చెరువు వద్ద మస్తర్ తీసుకొని పనులు మాత్రం ఆర్అండ్ఆర్ కాలనీలో చేయిస్తున్నారు. అదేంటని అడిగితే ఆర్అండ్ఆర్ కాలనీలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉందని చెట్ల పొదలను తీయించమని ఐటీడీఏ పీఓ ద్వారా వచ్చిన ఆర్డర్ మేరకు కాలనీలో పనిచేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. ఈ విషయమై స్థానిక రైతు, ఉపాధి హామీ కూలీ వర్షా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చెరువు పూడిక తీత పనుల్లో మట్టిని పొలాల్లోకి తోలుకుంటామంటే కేసు పెడతామని ఏపీవో హెచ్చరించారని అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట మస్తర్ తీసుకొని మరోచోట పని చేయించడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమేనా అధికారులకు ఉండవా.. వారు పాటించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రైతులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయించాలని డిమాండ్ చేశారు.


