ద్వారకాతిరుమల: సదా వేంకటేశం.. స్మరామి.. స్మరామి అంటూ శ్రీవారిని భక్త జనం మనసారా కొలిచింది. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. పలు భజన మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.


