ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కూలీల జీవనంపై దెబ్బకొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి ఆరోపించారు. శనివారం ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి జ్ఞానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కోటగిరి రాజా నాయనతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అవినీతిపై ఉన్న శ్రద్ధ కూలీలకు వేతనాలు చెల్లించటం లేదన్నారు. 2025 డిసెంబర్ నుంచీ రాష్ట్రంలో ఏకంగా రూ.1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు మండుటెండలో కనీసం మంచినీరు ఇవ్వలేని స్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారిన వెంటనే కూటమి నేతలు తమకు అనుకూలమైన ఎఫ్ఏలను నియమించుకుని, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నకిలీ మస్తర్లు, బినామీ కూలీలతో అవినీతి దందా సాగుతుందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 27న వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకత్వంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధి కూలీల సమస్యలు, అవినీతి, బకాయిల విడుదలపై ధర్నా చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి చిన్న అనిల్కుమార్, ఎంపీటీసీ సభ్యులు పంతులు వెంకన్నబాబు, వార్డు సభ్యులు రామయ్య తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి


