జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అందిస్తున్న అన్నప్రసాదంలో పురుగు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న ఓ చిన్నారి భోజనంలో పురుగు రాగా తండ్రికి చూపించింది. దీంతో వెంటనే ఆ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా ప్లేటులో ఉన్న అన్నం పడేసి రండి... మళ్లీ పెడతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చిన్నారి తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఆలయ ఈఓ చిన్నారి తండ్రికి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీస్స్టేషన్లో పెట్టి కుమ్మించేస్తానని.. కేసులు బనాయిస్తానని ఈఓ బెదిరించినట్లు చెప్పారు. జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఆలయ సిబ్బంది, ఈఓ కూడా దురుసుగా వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈఓ కలగరశ్రీనివాస్ను వివరణ కోరగా అదంతా ఒట్టిదేనని.. అలాంటిదేమి జరగలేదని తెలిపారు.


